భారత్లో ఇంటర్నెట్ షట్ డౌన్పై షాకింగ్ లెక్కలు.. 4 ఏళ్లలో 400 పైచిలుకు సార్లు.. గంటకు ఎంత నష్టమంటే
రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో అంతర్జాతీయ సమాజం కూడా రైతు ఆందోళనలపై చర్చిస్తోంది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు రైతు ఆందోళనలకు మద్దతు పలకడంపై దేశవ్యాప్తంగా అనుకూల,వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి విస్తృత చర్చకు దారితీసిన 'ఇంటర్నెట్ షట్ డౌన్'కి సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలు తెర పైకి వస్తున్నాయి.
గత నాలుగేళ్లలో 400 పైచిలుకు సార్లు...
భారత్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ అసాధారణమేమీ కాదు. నూతన సంవత్సరం 2021లో ఇప్పటివరకూ భారత్ ఏడుసార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ విధించింది. హర్యానాలోని రైతుల నిరసన ప్రదేశాల్లోనే ఐదుసార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ విధించింది. ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాలన్నింటి కంటే తరుచూ ఇంటర్నెట్ షట్ డౌన్స్ విధిస్తున్న దేశం ఒక్క భారత్ మాత్రమేనని ఫోర్బ్స్ రిపోర్టులో వెల్లడైంది. గడిచిన నాలుగేళ్లలో 400 పైచిలుకు సార్లు భారత ప్రభుత్వం ఇంటర్నెట్ షట్ డౌన్ విధించినట్లు internetshutdowns.in రిపోర్ట్స్ చెబుతున్నాయి.
అతి సుదీర్ఘ షట్ డౌన్ భారత్లోనే...
ప్రపంచంలోనే అతి సుదీర్ఘ ఇంటర్నెట్ షట్ డౌన్ కూడా భారత్లోనే నమోదైంది. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక.. అగస్టు 4,2019 నుంచి మార్చి 4,2020 వరకు 223 రోజుల పాటు అక్కడ ఇంటర్నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. భారత్లో ఎక్కువ ఇంటర్నెట్ షట్ డౌన్స్ విధించబడుతున్న రాష్ట్రం జమ్మూకశ్మీర్ కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్తాన్,ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్,హర్యానా,మహారాష్ట్ర ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్ రోజుల తరబడి విధించబడుతోంది.
గంటకు రూ.2కోట్లు నష్టం...
భారత్లో 2017లో 79 సార్లు, 2018లో 134 సార్లు,2019లో 106 సార్లు,2020లో 83 సార్లు,2021లో ఇప్పటివరకూ ఏడుసార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ విధించినట్లు internetshutdowns.in రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2017లో 21 షట్ డౌన్స్లో మూడు రోజుల కన్నా ఎక్కువగా ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. 2018లో విధించిన షట్ డౌన్స్లో ఐదుసార్లు మూడు రోజుల కన్నా ఎక్కువగా, 2019లో ఆరుసార్లు మూడు రోజుల కన్నా ఎక్కువగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 10వీపీఎన్ రిపోర్ట్ ప్రకారం... 2020లో భారత్లో 8927 గంటలు ఇంటర్నెట్ షట్ డౌన్ విధించగా.. దీనివల్ల 2.7 బిలియన్ డాలర్ల(రూ.20,474కోట్లు) నష్టం వాటిల్లింది. అంటే గంటకు రూ.2కోట్లు చొప్పున నష్టం వాటిల్లినట్లు లెక్క.
ఆ నిబంధన ప్రకారం...
భారతీయ చట్టాల్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్(DoT)లో టెలికాం సేవల తాత్కాలిక సస్పెన్షన్(పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ) నిబంధన పొందుపరచబడింది. దీని ప్రకారం తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రజా భద్రత లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనను అనుసరించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయవచ్చు.