హైపర్ టెన్షన్పై కొరవడిన అవగాహన!దేశంలో సగం మందికి బీపీ ఉన్నట్లే తెలియదట!
కాలంతో పాటు మారుతున్న జీవన విధానం, వృత్తి పరమైన ఒత్తిడులు, ఇలా కారణాలు ఏవైనా భారత్లో హైపర్ టెన్షన్ (హైబీపీ) బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారత్లో హై బీపీ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ చాలా మందికి ఆ విషయం తెలియదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. సగం కన్నా తక్కువ మంది మాత్రమే దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారని నివేదిక స్పష్టంచేసింది.
పీహెచ్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధ్యయనం
దేశంలో హైబీపీకి సంబంధించి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హెయిడెల్బెర్గ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్, గాటింజెన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు విస్తృత స్థాయిలో అధ్యయనం చేశారు. హైపర్ టెన్షన్ కారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదంతో పాటు అధిక రక్తపోటును నియంత్రించడంపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
7లక్షల మందిపై అధ్యయనం
రీసెర్చర్లు 15 నుంచి 49 ఏళ్ల వయసున్న 7లక్షల 31 వేల 864 మందిపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించారు. ఇందులో భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి దేశంలో కేవలం 45 శాతం మంది మాత్రమే బీపీ పరీక్షలు చేయించుకుంటున్నారని సర్వేలో తేలింది. హైపర్ టెన్షన్ నియంత్రణకు 13శాతం మంది మందులు వాడుతుండగా... 8 శాతం మంది మాత్రమే బీపీని అదుపులో ఉంచుకుంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంత పురషుల్లో 5.3శాతం, మహిళల్లో 10.9శాతం మంది మాత్రమే మందుల ద్వారా హై బీపీని అదుపులో ఉంచుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది.
వెల్నెస్ క్లీనిక్లతో సమస్యకు చెక్
హైపర్ టెన్షన్కు సంబంధించి భారత్లో చేపట్టిన చర్యలు, చికిత్సా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని రీసెర్చర్లు అభిప్రాయ పడుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.