చట్టాల మార్పులు సరిపోవు: మహిళలపై నేరాలపై వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: మహిళలపై దేశంలో జరుగుతున్న దారుణాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. మహిళలపై వేధింపుల నిరోధానికి నూతన చట్టాలు తీసుకురావడం పరిష్కారం కాదని ఆయన అన్నారు. రాజకీయ సంకల్పం, పాలనాపరమైన చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన 16వ స్నాతకోత్సవంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడారు. మహిళలపై నేరాల నియంత్రణకు నూతన చట్టాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం కాదని చెప్పారు.
ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, నిర్భయ చట్టం తీసుకువచ్చినా మహిళలపై నేరాలు ఆగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఉన్నావ్లో జరిగిన ఇటీవలి సంఘటనలను ప్రాస్తవిస్తూ కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలు సిగ్గు చేటని, ఇలాంటి ఘటనలు తక్షణమే నిలిచిపోయేలా మనమంతా ప్రతినబూనాలని పిలుపునిచ్చారు.
న్యాయం ప్రతీకారంగా మారకూడదంటూ సీజేఐ
అత్యాచార కేసుల్లో త్వరగా తీర్పులు చెప్పాలన్న డిమాండ్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వెంటనే తీర్పు చెప్పడం సరికాదన్నారు.
జస్టిస్(న్యాయం) అనేది ప్రతీకారంగా మారితే న్యాయం రూపు రేఖలు కోల్పోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బోబ్డే శనివారం వ్యాఖ్యానించారు. రేప్ కేసుల్లో త్వరగా తీర్పులు చెప్పాలన్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలతో విభేదించారు సీజేఐ. జోధ్పూర్లో ఓ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. 'న్యాయం అనేది సత్వరంగా జరగాలనడం సరికాదు. న్యాయం అనేది ప్రతీకారంగా మారితే.. న్యాయం రూపు మారిపోతుంది' అని అన్నారు. హైదరాబాద్లో వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల ఎన్కౌంటర్ తర్వాత ఇలాంటి అన్ని కేసుల్లోనూ నిందితులను ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్లు పెరిగిపోయాయి. మరోవైపు ఇలా ఎన్కౌంటర్లు చేయడం కూడా సరిదనే వాదనలు వినిపిస్తున్నాయి.