రైతుల కంటే నిరుద్యోగుల ఆత్మహత్యలే ఎక్కువ: ఎన్సీఆర్బీ డేటా
న్యూఢిల్లీ: జాతీయ నేర నమోదు సంస్థ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో-ఎన్సీఆర్బీ) సంచలన విషయాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 2018లో రైతుల ఆత్మహత్యల కంటే నిరుద్యోగులు, రోజువారీ కూలీల ఆత్మహత్యలే ఎక్కువ అని ఎన్సీఆర్బీ గణాంకాలు పేర్కొంది.
2018లో సగటున రోజుకు 35 మంది నిరుద్యోగులు, 36 మంది స్వయం ఉపాధి ఉన్న వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడినట్లు వెల్లడించింది. 2018లో దేశ వ్యాప్తంగా 10,349 మంది వ్యవసాయ రంగానికి చెందిన వ్యక్తులు(రైతులు) ఆత్మహత్య చేసుకోగా.. 13,149 మంది సొంత ఉపాధి గల వ్యక్తులు, 12,936 మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడినట్లు ఎన్సీఆర్బీ తెలియజేసింది.
2018లో మొత్తంగా 1,34,516 ఆత్మహత్య ఘటనలు నమోదైనట్లు వెల్లడించింది. 2017తో పోలిస్తే ఇది 3.6 శాతం ఎక్కువ. 2018లో మొత్తం 42,931 మంది మహిళలు బలవన్మరణాలకు పాల్పడగా.. వీరిలో 54.1శాతం అంటే 22.937 మంది గృహిణులు ఉన్నారని వెల్లడించింది.
ఆత్మహత్యలు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 17,972 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు(13,896), పశ్చిమబెంగాల్(13,225), మధ్యప్రదేశ్(11,775), కర్ణాటక(11,561) ఉన్నాయి. కాగా, దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం ఆత్మహత్య ఘటనల్లో సగానికిపైగా(50.9శాతం) ఈ ఐదు రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నాయని జాతీయ నేర నమోదు సంస్థ పేర్కొంది.