ఫేస్బుక్ అశ్లీల ఫొటోల పోస్ట్: లేడీ టీచర్ ఆత్మహత్య
చెన్నై: దుండగుల చర్య ఓ మహిళా టీచర్ ప్రాణాలను బలి తీసుకుంది. తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రానికి తగిలించి ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా టీచర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. దీంతో సేలం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
సేలం జిల్లా ఇడనగనశాలైకి చెందిన అన్నాదురై కుమార్తె వినుప్రియ (20) తిరుచెంగోడు ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. ఈ నెల 17న ఆమె అశ్లీల చిత్రాలు ఫేస్బుక్లో అప్లోడ్ అయ్యాయి. వాటిని చూసిన వినుప్రియ తండ్రి అన్నాదురై షాక్కు గురయ్యారు. వెంటనే జిల్లా ఎస్పీ అమితకుమార్ వద్ద ఫిర్యాదు చేశారు.
ఆ చిత్రాలు ఫేస్బుక్లో వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని శంకగిరి డీఎస్పీ కందసామికి విజ్ఞప్తి చేశారు. అయితే.. దీన్ని అవమానంగా భావించి మనస్తాపానికి గురైన వినుప్రియ ఆదివారం రాత్రి తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వినుప్రియ అశ్లీల చిత్రాలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసినవారిని అరెస్టు చేసే వరకు తమ కుమార్తె మృతదేహాన్ని తీసుకుని వెళ్లేది లేదని ఆమె తల్లిదండ్రులు, బంధువులు సేలం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దీంతో సేలం కలెక్టర్ సంపత్ వినుప్రియ తలిదండ్రులతో చర్చలు జరిపారు. రెండు రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం అన్నాదురై తన కుమార్తె మృతదేహాన్ని తీసుకుని అంత్యక్రియలు నిర్వహించారు.
మనస్తాపానికి గురైన తన కూతురిని పోలీసులు విచారణ పేరిట వేధింపులకు గురిచేశారని, నిందితులను అరెస్టు చేయకుండా తననే వేధించడంతో ఆమె జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని అన్నాదురై ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురుకు పట్టిన గతి ఏ అమ్మాయికీ రాకూడదని ఏడ్చేశారు.
ఫేస్బుక్లో విడుదలైన అశ్లీల చిత్రాలను తొలగించేందుకు 15 రోజులు పడుతుందని పోలీసు అధికారులు చెప్పారని, ఆలోపున తన సెల్ఫోనకు కూడా ఆ ఫోటోలు రావడంతో తాను మరింత కుంగిపోయానని అన్నాదురై అన్నారు.