కాల్గర్ల్స్ అంటూ కాలేజీ అమ్మాయిల నగ్న చిత్రాల కలకలం
ఆగ్రా: ఉత్తర ప్రదేశ్లోని విరిందావన్కు చెందిన కాలేజీ అమ్మాయిల అశ్లీల చిత్రాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఆథ్యాత్మిక పట్టణమైన విరిందావన్లోని విద్యాసంస్ధల్లో చదువుకుంటున్న 50 మందికి పైగా విద్యార్ధినుల ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో ఉంచారు.
వారిని కాల్ గర్ల్స్గా పేర్కొంటూ వాట్సప్ ద్వారా మార్ఫింగ్ ఫోటోలు, అమ్మాయిల పేర్లు, చిరునామా తదితర వివరాలను పొందుపర్చారు. వీటితో పాటు అమ్మాయిలు ధరలను కూడా అందులో పొందుపరిచారు. దీంతో బాధిత యువతుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 50 మంది అమ్మాయిల్లో కొంతమంది లక్నో, పాట్నాలకు చెందిన వారు కూడా ఉండటం విశేషం. గతేడాది నవంబర్లో కూడా విరిందావన్ తరహాలో పదుల సంఖ్యలో అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఘటన సంచలనం రేపింది.
తాజా వ్యవహారంపై బాధితుల్లో కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి మథుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మథుర ఎస్సీ అలోక్ ప్రియదర్శిని స్పందిస్తూ ఈ ఘటనపై సైబర్ క్రైమ్ కేసుగా నమోదుచేసి నిందితులకోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే గతంలో చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వల్లే విరిందావన్ పట్టణంలో మళ్లీ ఇలాంటి ఘోరాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.