వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగిన మసీదు: పెళ్లి బాజాలు..మేళతాళాలు: ఒక్కటైన హిందూ జంట..!
తిరువనంతపురం: ముస్లింల ప్రార్థనా స్థలం మసీదుకు సమీపంలో సాధారణంగా పెళ్లి బాజాలు మోగవు. మేళతాళాలు, తప్పెట్ల మోతలతో వెళ్లే ఊరేగింపులు కూడా.. మసీదు మీదుగా వెళ్లాల్సి వస్తే.. నిశ్శబ్దాన్ని పాటిస్తాయి. ముస్లింల సంప్రదాయాలను గౌరవిస్తున్నారనడానికి నిదర్శనంగా దీన్ని చెప్పుకోవచ్చు. అలాంటి మసీదులో ఏకంగా పెళ్లి బాజాలు మోగితే?.. వేద మంత్రోచ్ఛారణలతో మసీదు మారుమోగితే ఎలా ఉంటుంది..?
పెళ్లి మంటపంలా మారిన మసీదు..
అలాంటి అరుదైన సంఘటన ఆదివారం కేరళలోని అళప్పుజ (అలెప్పీ)లో చోటు చేసుకుంది. అళప్పుజలోని చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు దీనికి వేదికగా మారింది. మసీదు వేదికగా.. హిందూ సంప్రదాయబద్ధంగా ఓ జంట ఒక్కటైంది. తమ కొత్త జీవితాన్ని ఆరంభించింది. ఆ నవ దంపతుల పేర్లు శరత్, అంజు. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే- ఈ పెళ్లికి అవసరమైన ఖర్చులను ముస్లిం జమాత్ మసీదు పెద్దలు స్వయంగా చందాల రూపంలో వసూలు చేయడం.
మసీదు కమిటీ ఆర్థిక సహాయంతో..
వధువు అంజు దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి. అయిదేళ్ల కిందట తండ్రి అశోకన్ మరణించాడు. తల్లి బిందు స్థానికంగా చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. తన కుమార్తెకు పెళ్లి చేయడానికి ఆమె కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం జమాత్ మసీదు పెద్దల దృష్టికి వచ్చింది. దీనితో వారు స్వచ్ఛందంగా విరాాళాలను సేకరించాలని నిర్ణయించుకున్నారు. అంజు పెళ్లి కోసం ఏకంగా అయిదు లక్షల రూపాయలను సేకరించారు.
2500 మందికి విందు భోజనం..
ఈ డబ్బుతో వైభవంగా వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. మసీదు ప్రాంగణాన్ని పెళ్లి మంటపంగా మార్చారు. పచ్చటి తోరణాలతో మసీదును అలంకరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహాన్ని జరిపించారు. ఈ పెళ్లికి 2500 మందిని ఆహ్వానించారు. వారందరికీ హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా విందుభోజనాన్ని వడ్డించారు. ఈ ఘటన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ముస్లింల చర్యలపై ప్రశంసలు కురుస్తున్నాయి..
తన ఫేస్బుక్లో ప్రస్తావించిన పినరయి విజయన్..
మసీదులో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు. దీన్ని ఆయన తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో ప్రస్తావించారు. పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోను కూడా ఆయన జత చేశారు. తన రాష్ట్రం మత సామరస్యానికి పెట్టింది పేరు అని హర్షం వ్యక్తం చేశారు. సర్వమానవ సమానత్వానికి అద్దం పట్టిందని అన్నారు. అన్ని కులాలు, మతాలు ఒక్కటేననే సారాంశాన్ని చాటి చెప్పడమే తన రాష్ట్ర ప్రత్యేకత అని ఆయన రాసుకొచ్చారు.