ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్: ముస్లింలు ఎక్కువున్న నియోజకవర్గాల్లో పెరిగిన పోలింగ్, సీలాంపూర్లో రికార్ట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గింది. 2015లో 67.12 శాతం నమోదు కాగా.. శనివారం జరిగిన పోలింగ్లో అది 61.7 శాతానికి చేరింది. మొత్తంగా ఆరు శాతం పోలింగ్ తగ్గింది. కానీ సబర్బన్లో పోలింగ్ పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ పెరిగింది. ఆ ఓటు బ్యాంకు బీజేపీ వ్యతిరేకంగా పనిచేసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.
అక్కడ పెరిగిన పోలింగ్..
ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్ పెరిగింది. వీరంతా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేశారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ముస్లింలు ఎక్కువగా ఉన్న సీలాంపూర్లో అత్యధికంగా 71.4 శాతం పోలింగ్ జరగడం విశేషం. అదేవిధంగా ముస్తాఫాబాద్ 70.55, బాబర్పూర్ 65.4, సీమపురి 68.08 పోలింగ్ రికార్డైంది. షాదరలో 65.78, మటియా మహల్లో 68.36 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ శాతం కాస్త అటు ఇటుగా కూడా మారొచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి.
ఇక్కడ తగ్గింది..
ముస్లిం జనాభా తక్కువగా ఉన్న చాందినీ చౌక్ 60.91, రిథులా 59.62, బల్లిమారన్ 58.83 శాతం, ఓక్లా 58.83 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ ముస్లింల ప్రాబల్యం తక్కువగా ఉండటంతో పోలింగ్ తగ్గి ఉంటుందని అంచనాలు నెలకొంటున్నాయి.
మళ్లీ ఆపే..?
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగిన షాహీన్బాగ్..ఓక్లా నియోజకవరగంలో ఉంది. ఇక్కడి నుంచి ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే అమానుతల్లా కాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరిగి ఇక్కడ ఆప్ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ముస్తఫాబాద్ స్థానంలో మాత్రం 2015లో బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ నేత జగదీశ్ ప్రదాన్ ఇక్కడినుంచి విజయం సాధించారు. 2020లో మాత్రం ఆప్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.