మెజారిటీ దళిత, ముస్లీం ఓటర్ల నియోజక వర్గాల్లో బీజేపీ హవా, పని చెయ్యని కాంగ్రెస్ ప్రచారం !
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మీద ఈ లోక్ సభ ఎన్నికల్లో ముస్లీంలు, దళితుల ప్రభావం పడుతుందని కాంగ్రెస్ వేసిన అంచనా తారుమారైయ్యింది. ముస్లీంలు, దళితులు అధిక సంఖ్యలో ఉన్న లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీ దూసుకుపోతుంది. బీజేపీకి ముస్లీంలు, దళితులు వ్యతిరేకం కాదని 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు అంటున్నాయి.
ఇది లెక్క
ముస్లీంలు అధికంగా ఉన్న 49 లోక్ సభ నియోజక వర్గాల్లోని 23 నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కేవలం 13 లోక్ సభ నియోజక వర్గాల్లో యూపీఏ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. రిజర్వుడు లోక్ సభ స్థానాల్లో 47 చోట్ల బీజేపీ దూసుకుపోతుంది. కేవలం 14 లోక్ సభ నియోజక వర్గాల్లో యూపీఏ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
ఉత్తరప్రదేశ్
ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో అధిక సంఖ్యలో ముస్లీంలు, దళితులు ఉన్నారు. మీరట్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర అగర్వాల్ దూసుకుపోతున్నారు. మీరట్ లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర అగర్వాల్ కు ఎదురుదెబ్బ తగులుతుందని అనుకున్న వారికి ఊహించని ఫలితాలు ఎదురౌతున్నాయి.
ప్రతిపక్షాల అంచనా
బీజేపీ ముస్లీంలు, దళితుల విరోధి అంటూ దేశం మొత్తం ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. గోహత్య, గోరక్షుల దాడులు, తలాక్ నిషేదం లాంటి అంశాలు బీజేపీ మీద పడతాయని కాంగ్రెస్ ఊహించింది. అయితే ఇలాంటి అంశాలు బీజేపీ మీద ప్రభావం చూపించడానికి కాంగ్రెస్ పార్టీ సరైన వ్యూహాలు అమలుచెయ్యలేదు.
జయప్రద దెబ్బ
ఉత్తరప్రదేశ్ లోని రామాపురలో అధిక సంఖ్యలో ముస్లీం ఓటర్లు ఉన్నారు. లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో సమాజ్ వాది పార్టీ అభ్యర్థి అజాం ఖాన్ ను ముస్లీం ఓటర్లు తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన విషయం స్పష్టంగా కనపడుతోంది. రామాపుర లోక్ సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బహుబాష నటి జయప్రద ముందంజలో దూసుకుపోతున్నారు.
పని చెయ్యని ఆరోపణలు
రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ తదితర చోట్ల గోవులను తరలిస్తున్న ముస్లీంల మీద దాడి చెయ్యడంతో వారు మరణించారని అనేక కేసులు నమోదు అయ్యాయి. ముస్లీంలను హత్య చేసిన బీజేపీ మీద ఈ ప్రభావం పడుతుందని అనుకున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పరిశీలిస్తే ఆ ప్రభావం ఏమీ లేదని వెలుగు చూసింది. మొత్తం మీద ముస్లీంలు, దళిత ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు.