లాక్డౌన్: 5 పిల్లల్ని నదిలో విసిరేసిన తల్లి.. తిండిలేకేనని ఆరోపణలు..భర్తతో గొడవలే కారణమన్న పోలీసులు
లాక్ డౌన్ దెబ్బకు పని కోల్పోయిన రోజు కూలీలు ఆకలితో అలమటిస్తున్నారని, కనీసం భిక్షమెత్తే అవకాశం కూడా లేకపోవడంతో సొంత పిల్లల్నే చంపుకుంటున్నారని, జార్ఖండ్ లో ఇప్పటికే మూడు ఆకలిచావులు చోటుచేసుకున్నాయన్న విషాదకర వార్తల్ని మర్చిపోకముందే, ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. ఓ తల్లి తన కడుపునపుట్టిన ఐదుగురు పిల్లల్ని గంగానదిలోకి విసిరేసింది. లాక్డౌన్ కారణంగా పిల్లలకు పెట్టడానికి తిండి లేకే ఆమె ఈ పని చేసిందని తొలుత రిపోర్టులు వచ్చాయి. కానీ పోలీసులు, జిల్లా యంత్రాంగం మాత్రం 'ఆకలి' ఆరోపణల్ని కొట్టిపారేశారు. భర్తతో గొడవ కారణంగానే ఆమె దారుణానికి ఒడిగట్టిందని అధికారిక ప్రకటన చేశారు. గోపాల్ గంజ్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
మంజు వర్సెస్ మున్న
ఈస్ట్ ఉత్తర్ ప్రదేశ్ లో గంగా నదిని ఆనుకుని ఉండే భదోహీ జిల్లా కేంద్రం కార్పెట్ల తయారీకి చాలా ఫేమస్. దాని శివారు గ్రామమైన జహంగీరాబాద్ లో మృదుల్ యాదవ్ అలియాస్ మున్నా, మంజూ యాదవ్ దంపతులు జీవిస్తున్నారు. వాళ్లకు మొత్తం ఐదుగురు పిల్లలు. మహేశ్వరి(12), ఆర్తి(10), శివ శంకర్(8), సరస్వతి(6), కేశవ్ ప్రసాద్(3). రోజు కూలీగా పనిచేసే మున్నా ఒక్కడే కుటుంబానికి ఆధారం. లాక్ డౌన్ కారణంగా పని లేకపోవడంతో పూటగడవటం ఇబ్బందిగా మారింది. ఇది భార్యాభర్తల మధ్య తగువులాటకు దారితీసింది. శనివారం రాత్రి ఇద్దరి మధ్యా కొట్లాట జరిగింది. పట్టరాని కోపంతో మంజు.. ఐదుగురు పిల్లల్ని తీసుకుని నదివైపునకు పరుగులు తీసింది..
దెయ్యం అనుకుని పరుగులు..
మున్నా కోపంలో భార్యను కొట్టడం, అమె అలిగివెళ్లి, కాసేపటికి తిరిగి రావడం కామన్ వ్యవహరం. కాబట్టే మున్నా కామ్ గా ఇంట్లోనే పడుకుండిపోయాడు. రెండు చేతులతో.. ఐదుగురు పిల్లల్ని బలవంతంగా నదివైపునకు లాక్కొస్తున్న మంజును చూసి.. గంగా తీరంలోని జాలర్లు షాక్ తిన్నారు. దెయ్యం అనుకుని భ్రమపడి అక్కణ్నుంచి పారిపోయారు. పిల్లల్ని నదిలోకి విసిరేన తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకుందామె. కానీ చావలేక మళ్లీ ఒడ్డుకొచ్చేసింది. తెల్లారేదాకా అక్కడే నిచ్చేష్టురాలై కూలబడింది.
ముందు మీడియా.. తర్వాత పోలీసులు..
పొద్దుపొద్దున్నే మంజును నది ఒడ్డున చూసిన స్థానికులు.. దగ్గరికెళ్లి ఆరా తీయగా జరిగిన విషయం చెప్పేసింది. ఇంతలో స్థానిక మీడియా అక్కడికొచ్చి కారణాలు శోధించగా, పేదరికం, ఆకలి బాధల వల్లే ఆ తల్లి ఘోరానికి ఒడిగనట్లు వెల్లడైంది. ఆ తర్వాత పోలీసులు ఎంటరై, గజ ఈత గాళ్లతో పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దపాప మహేశ్వరి(12) మృతదేహం లభ్యంకాగా, మిగతావారి కోసం తీవ్రంగా వెతికారు. వార్తల ప్రవాహం పెరగడంతో జిల్లా కలెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎస్పీ రాంబదన్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు.
గొడవలే కారణమంటూ..
అప్పటిదాకా పిల్లల్ని నదిలో విసిరేయడానికి వేర్వేరు కారణాలు చెప్పిన మంజూ యాదవ్.. పోలీసులు వచ్చిన తర్వాత అసలు విషయం ఇదంటూ చెప్పింది. ‘‘భార్తతో గొడవల కారణంగానే నేను పిల్లల్ని నదిలోకి విసిరేశాను''అన్న వీడియో వాగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు. అంతేకాదు, మున్నా-మంజూ ఇంటికి వెళ్లి, వంటింట్లో గిన్నెల్ని కూడా ఫొటోలు తీశారు. ఇంట్లో వండిన రోటి, అన్నం ఉన్నాయని నిర్దారించారు. ఇది ముమ్మాటికీ ఆకలి మరణాలు కావని, పిల్లల్ని నదిలో విసిరేసిన తల్లిపై కేసు పెడతామని అధికారులు చెప్పారు.
9నెలలకు సరిపడా ధాన్యాలు
దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్ డౌన్ ను ఈనెల చివరి వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తిండిగింజల నిల్వలపై కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో ప్రతినెలా 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పీడీఎస్ ద్వారా అందజేస్తున్నామని, రాబోయే 9 నెలలకు కూడా సరిపడినంత ధాన్యాలు మనకు అందుబాటులో ఉన్నాయని మంత్రి భరోసా ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయినవారికి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 1.7లక్షల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా,
30 లక్షల మంది అర్ధాకలితో..
అభివృద్ధి చెందుతున్న దేశంగా పేరుపొందిన ఇండియాలో జార్ఖండ్, యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని కొన్ని ఘటనలు రిపోర్ట్ అవుతున్నప్పటికీ, మెజార్టీ రాష్ట్రాల్లో ఆకలి చావులు లేవని నివేదికలు చెబుతున్నాయి. ఇక, బాగా అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాల్లోనైతే లాక్ డౌన్ కారణంగా కనీసం 30 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ‘ది ఫుడ్ ఫౌండేషన్'అనే స్థానిక అధ్యయన సంస్థ తెలిపింది. ప్రస్తుతం యూకేలో సుమారు 85వేల కొవిడ్-19 కేసులుండగా, అందులో 10,612 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు, దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలోనూ జనం ఆకలికేకలు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందరికంటే ముందే లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడ కేవలం 129 కరోనా కేసులు, ఆరు మరణాలు మాత్రమే సంభవించాయి. అయితే దేశంలో 65 శాతం మంది అసంఘటిత రంగానికి చెందినవాళ్లే కావడంతో వాళ్లంతా పని లేక పస్తులుంటున్నట్లు తెలుస్తోంది.