అక్రమ సంబంధం: పసికందు తల నరికేసిన తల్లి
విజయపూర్: కర్ణాటక రాష్ట్రంలోని విజయపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ద్వారా కలిగిన సంతానాన్ని అడ్డు తొలగించుకోవాలనుకుంది ఓ దుర్మార్గురాలు. కన్న కూతురని కూడా చూడకుండా చిన్నారి తల నరికేసి చంపేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక విజయపూర్కి చెందిన నిందిత మహిళ వివాహేతర సంబంధం కారణంగా తల్లయింది. ఈ నేపథ్యంలో తనకు పుట్టిన ఆ పసికందు తల నరికేసి రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో పడేసింది.
కాగా, గమనించిన స్థానికులు ఆమెను పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
భర్త నాలుగేళ్ల క్రితమే వదిలేసి వెళ్లిపోయాడని, ఇప్పుడు బిడ్డ గురించి తెలిస్తే అందరూ తనను అవమానిస్తారన్న భయంతో కన్న బిడ్డనే చంపేసినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు దర్యాప్తు చేస్తున్నారు.