మూడేళ్ల కుమారుడి నాలుకను తెగ్గోసి..కాలువలో విసిరేసి..!
బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కిరాతక తల్లి తన మూడేళ్ల కుమారుడి నాలుకను తెగ్గోసింది. అనంతరం ఆ చిన్నారిని నదిలోకి విసిరేసింది. చిక్ మగళూరు జిల్లా తరికెరె తాలూకాలోని హళియారులోొ ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ కు పంపించారు. ఆమె పేరు కమల. చిక్ మగళూరు జిల్లా కడూరు తాలూకాలోని నిడఘట్టె గ్రామానికి చెందిన కమల, భర్త, అత్తామామలతో కలిసి నివసిస్తోంది. కమలకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి పేరు తేజస్. రెండురోజులుగా ఆ చిన్నారికి ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు.
బాగ్దాదిని గుర్తించిన బ్రీడ్ జాగిలలకు పోలీసు శాఖలో భలే డిమాండ్: ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికపై..!
దీనితో సమీపంలోని తరికెరెలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం రాత్రి హఠాత్తుగా కమల.. తేజస్ ను తీసుకుని ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లిపోయింది. తరికెరె నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న హళియూరు గ్రామానికి ఆటోలో చేరుకుంది. అక్కడే తేజస్ నాలుకను కత్తిరించింది. ఏడుస్తున్న చిన్నారిని భద్ర నది కాలువలోకి విసిరేసింది. దీనితో తేజస్ మరణించాడు. సుమారు గంట తరువాత తరికెరె ఆసుపత్రికి చేరుకుంది.
భద్రా నది కాలువలో తేజస్ మృతదేహం సుమారు అయిదు కిలోమీటర్ల దూరం పాటు కొట్టుకునిపోయింది. బెట్టె తవరకెరె గ్రామ సమీపంలో ముళ్ల పొదలకు చిక్కుకుని ఉన్న తేజస్ మృతదేహాన్ని గురువారం ఉదయం గుర్తించారు స్థానికులు. వెంటనే తరికెరె పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తేజస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తన కుమారుడు కనిపించట్లేదంటూ కమల తరికెరె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసుపత్రి సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. కమల తన కుమారుడిని ఎత్తుకుని బయటికి వెళ్లడం, కొంత సేపటి తరువాత ఖాళీ చేతులతో తిరిగి రావడాన్ని గుర్తించారు. దీనితో ఆమె బండారం బట్టబయలైంది. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నేరాన్ని అంగీకరించింది. తానే తేజస్ ను కాలువలోకి విసిరేసినట్లు వెల్లడించింది. ఆమెపై హత్యకేసును నమోదు చేశారు పోలీసులు. రిమాండ్ కు తరలించారు. ఆమె ఎందుకు ఈ దారుణానికి పాల్పడిందనే విషయం తెలియరాలేదు.