నాలుగేళ్లుగా ఆ తల్లీకూతుళ్లు.. వారింట్లోనే బందీలు
ఢిల్లీలో దాదాపు నాలుగేళ్లుగా ఇంట్లోంచి బయటికి రాకుండా తమను తామే తమ ఇంట్లో బందీలుగా చేసుకుని బతుకుతున్న తల్లీకూతుళ్లను పోలీసులు కాపాడారు.
న్యూఢిల్లీ: దాదాపు నాలుగేళ్లుగా తమను తామే తమ ఇంట్లో బందీలుగా చేసుకుని బతుకుతున్న తల్లీకూతుళ్లను ఢిల్లీ పోలీసులు కాపాడారు. వారిద్దరూ డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
కళావతి(42), ఆమె కుమార్తె దీప(20) ఇలా బందీలుగా జీవిస్తున్న వైనాన్ని వారి పొరుగింటిలో ఉండే ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దీంతో వారు వెళ్లి ఆ తల్లీకూతుళ్లిద్దరినీ బయటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చారు.
వారితోపాటు అదే ఇంట్లో నివసిస్తున్న ఆ మహిళ మామను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తల్లీకూతుళ్లిద్దరూ ఏళ్ల తరబడి పోషకాహారం లేక బాగా నీరసించి ఉన్నారని, అంతేకాకుండా వాళ్లు చాలా అపరిశుభ్రమైన వాతావరణంలో జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఆ తల్లీకూతుళ్లిద్దరూ మానసిక వ్యాధితోనూ, భ్రమలతో జీవిస్తున్నారని, ఆకలేసి భోజనం అడిగినప్పుడు పక్క గదిలోనే ఉండే కళావతి మామ మహావీర్ మిశ్రా వారికి ఆహారం అందించేవారని, తమ వెంట ఆసుపత్రికి వచ్చేందుకు కూడా తొలుత వారు నిరాకరించారని పోలీసులు పేర్కొన్నారు.
తన భార్య 2000 సంవత్సరంలో మరణించిందని, కొడుకులిద్దరూ నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారని మిశ్రా తెలిపారు. అప్పటి నుంచి కళావతి, దీప తమను తాము ఇంట్లోనే బంధించుకుని గడియ వేసుకున్నారని, తాను ఎంటీఎన్ఎల్ లో లైన్ మన్ గా పని చేసేవాడినని, తనకు వచ్చే కొద్దిపాటి పెన్షన్ డబ్బుతోనే తామందరం బతుకుతున్నామని ఆయన వివరించారు.