కూతుర్ను కాపాడేందుకు మొసలితో పోరాడిన తల్లి
వడోదరా: ఓ మహిళ తన కూతురును కాపాడుకునేందుకు తన ప్రాణాలను లెక్క చేయకుండా మొసలితో పోరాడింది. ఈ పోరాటంలో మొసలిని ధైర్యంగా ఎదుర్కొని తన కూతురును కాపాడుకుంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా జిల్లాలోని తికారియా ముబారక్ గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తికారియా ముబారక్ గ్రామ సమీపంలోని విశ్వామిత్ర నదిలో బట్టలు ఉతుకునేందుకు కంతా వాంకర్ (19) ఎప్పటిలాగే శుక్రవారం కూడా నది వద్దకు చేరుకుని... బట్టలు ఉతకడం ప్రారంభించింది. అంతలో నదిలోని మొసలి ఆమె కాలును నోట కరచి అమాంతంగా నదిలోకి లాగింది. దీంతో అక్కడే ఉన్న ఆమె తల్లి దీపాలి వెంటనే స్పందించింది.
బట్టలు ఉతికే కర్రతో మొసలి తలపై దాదాపు 10 నిమిషాలు ఏకధాటిగా బలంగా కొట్టింది. దాంతో మొసలి.. ఆమె కుమార్తె కాంత వాంకర్ కాలు వదిలి నదిలోకి జారుకుంది. వెంటనే దీపాలి తన కుమార్తెను ఆస్పత్రికి తరలించింది. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, విశ్వామిత్ర నదిలో దాదాపు 260 మొసళ్లు ఉన్నట్లు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణాంకాల ద్వారా తేలిందని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. నది పరివాహాక ప్రాంతంలో బట్టలు ఉతకవద్దని గ్రామస్తులను ఇప్పటికే హెచ్చరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.