అమ్మతనాన్ని మరచి .. చంటి పిల్లాడు ఏడుస్తున్నాడని తగలబెట్టేసిన తల్లి , దర్యాప్తులో షాకింగ్ విషయాలు
నవమాసాలు మోసి కని, గారాబంగా పెంచుకోవాల్సిన ఐదు నెలల పసికందును ఓ తల్లి అత్యంత కిరాతకంగా హతమార్చింది. మానవత్వాన్ని మరిచి పోయిన ఆ తల్లి, అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది. అభం శుభం తెలియని చిన్నారి ఏడుస్తున్నాడని పిల్లవాడికి నిప్పు అంటించింది. అమ్మతనాన్ని మరచిపోయి చంటి పిల్లాడిని తగలబెట్టేసింది. ఈ ఘటనలో ఐదు నెలల బాబు విగతజీవిగా మారగా, తాను తన కొడుకును తగలబెట్టినట్లు తనకు తెలియదని చెబుతోంది ఆ తల్లి.
తిండి పెట్టలేని దుస్థితిలో కసాయిగా మారిన కన్నతల్లి .. పేదరికంతో బిడ్డను కడతేర్చిన దారుణం
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో దారుణం .. కన్నకొడుకుకే నిప్పంటించిన అమానవీయం
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో చోటు దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఐదు నెలల పసికందును తగలబెట్టి అత్యంత దారుణంగా హతమార్చింది. పసికందును హత్య చేసిన కేసులో పోలీసులు తల్లిని అరెస్టు చేశారు. నిందితురాలిని సింగ్రౌలి జిల్లాలోని సుఖర్ గ్రామ నివాసి గుడ్డీ సింగ్ గోండ్ (27) గా గుర్తించారు. ఐదు నెలల పసికందుకు నిప్పంటించి హతమార్చిన తల్లి, తనకు ఆ పని తాను చేసినట్లుగా తెలియదని చెబుతోందని పోలీసులు చెబుతున్నారు.
పసిబిడ్డను హతమార్చిన తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదన్న పోలీసులు
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న చిత్రాంగి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీస్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం పసిబిడ్డను హతమార్చిన తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని, తానే ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో అలా చేశానని ఆమె చెప్పారని , నేరం అంగీకరించిందని పేర్కొన్నారు.
ఐదు నెలల పసి బాబు మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితురాలు అత్త పిల్లవాడు బాగా ఏడుస్తూ ఉండడంతో, కోపం పట్టలేని తల్లి గుడ్డీ తన మనవడికి నిప్పంటించి హతమార్చిందని పేర్కొంది.
మానసిక అనారోగ్యానికి మాంత్రికుడి వద్ద చికిత్స తీసుకుంటున్న తల్లి
ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు పసివాడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. నిందితురాలు గుడ్డీకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, ఆమె తన కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత మానసిక ఆరోగ్యానికి గురైనట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. పసివాడికి నిప్పంటించి చంపిన గుడ్డీ గత కొంత కాలంగా ఓ మాంత్రికుడు వద్ద మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే పసివాడిని తగలబెట్టిన ఘటనలో మాంత్రికుడి పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్షుద్ర శక్తుల కోసం మాంత్రికుడు చెప్పింది చేసిందా ? పోలీసుల దర్యాప్తు
క్షుద్ర శక్తుల సాధన కోసం మహిళతో ఆ విధంగా మాంత్రికుడు ఏమైనా చేయించారా ? లేదా తానే తన పసికందును హత్య చేసిందా అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. క్షుద్ర శక్తులు ఉపాసన కారణంగా ఆమె తన కొడుకును చంపినట్లు ఆమె కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా పిల్లలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన తల్లి, అభం శుభం తెలియని ఐదు నెలల పసి బాబు పట్ల అమానుషంగా ప్రవర్తించడం, సజీవదహనం చేయడం బాధాకరం.