వైరల్ పోస్టు: తన కొడుపై ఆ తల్లి రాసిన పోస్టు కదిలిస్తుంది
న్యూఢిల్లీ: పిల్లలు అపర మేధావులు అయినా.... ఏమీ తెలియని వారైనా కానివ్వండి....తల్లికి మాత్రం పిల్లల మీద ఉన్న ప్రేమ ఎన్నటికీ తగ్గదు. తమ పిల్లలతో పాటు చదువుతున్న ఇతర పిల్లలు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా... తన కొడుకుకు ఎందుకు రాలేదని ప్రశ్నించదు. ఎందుకంటే తన కొడుకు సామర్థ్యం ఏమిటో ఆ తల్లికి తెలుసు కాబట్టి. ఈ మధ్య సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఆ ఫలితాల్లో ఓ అబ్బాయికి 60శాతం మార్కులు వచ్చాయి.అయితే తన తల్లి సోషల్ మీడియాలో అబ్బాయి గురించి రాసిన పోస్టు వైరల్గా మారింది.
వైరల్ అవుతున్న ఓ తల్లి పోస్టు
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల కాగానే తన కొడుకుకు 60శాతం మార్కులు వచ్చాయన్న సంగతి గ్రహించింది వందన సుఫియా కటోట్ అనే ఓ తల్లి. 90శాతానికి పైగా వచ్చిన మార్కులు చూసిన తల్లిదండ్రులు తమ పిల్లల గొప్పతనాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటే వందన కూడా తన కొడుకు సాధించిన 60శాతం మార్కులకే తాను ఎంతో గర్వపడుతున్నానంటూ పోస్టులో రాసుకొచ్చింది.ఈ పోస్టు చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఫలితాల విడుదలయ్యాక మంచి మార్కులు సాధించని విద్యార్థులపై తల్లిదండ్రుల ఒత్తిడి ఏమేరకు ఉంటుందో తెలిసిందే. కానీ వందన పోస్టు చూసిన తర్వాత ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు చాలా రిలాక్స్ అయ్యారు.
60శాతం మార్కులు నాకు 90 శాతంతో సమానం
వందన సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇలా ఉంది. " 10వ తరగతి ఫలితాల్లో 60శాతం మార్కులు సాధించిన నా కొడుకును చూసి చాలా గర్వపడుతున్నాను. 90శాతం మార్కులు వచ్చి ఉండకపోవచ్చు. కానీ కానీ నా కొడుకుపై కొంచెం కూడా కోపం రాలేదు లేదా ప్రేమ తగ్గలేదు. ఎందుకంటే తను సబ్జెక్టులతో కుస్తీ పడుతుండటం నేను దగ్గరుండి చూశాను. అసలు పాస్ కాలేడేమో అని అనుకున్నాను. నీటిలో ఉన్న చేపలు చెట్లు ఎక్కమంటే ఎక్కుతాయా..? నీ సొంత ప్రపంచంలో నీవు ఏమి సాధించగలవో దానికోసమే యత్నించు, వాటిపైనే జ్ఞానం సంపాదించు" అని వందనా రాసిన పోస్టును పలువురు నెలిజెన్లు పాజిటివ్గా స్పందించారు.
తక్కువ సమయంలో ఎక్కువ లైకులు షేర్లు
సోషల్ మీడియాలో పోస్టు అయిన కొద్ది క్షణాల్లోనే 10వేల లైక్స్, 1400 కామెంట్లు, 5800 షేర్లు ఆ పోస్టుకు లభించింది. అంతేకాదు తన కొడుకుని అంతలా అర్థం చేసుకున్న వందనను అంతా అభినందిస్తూ కామెంట్ రాశారు. మన పిల్లల పట్ల గర్వంగా ఫీలవుదాం. మార్కులు సాధిస్తేనే వారిని ప్రశంసించడం లేకుంటే వారిని మందలించడంలాంటివి చేయకుండా... వారికి మద్దతుగా నిలుద్దామని మరో వ్యక్తి కామెంట్ రాశాడు. పిల్లలకు ఏమి కావాలో వారి సమస్యలను సావధానంగా వినడం తల్లిదండ్రుల బాధ్యత అని పోస్టులో గుర్తు చేశారు ఆవ్యక్తి.