దోమలు తరిమేందుకు తల్లి ప్రయత్నం... ప్రమాదంలో పడ్డ పసిబిడ్డ ప్రాణం..
నోయిడా : దోమలు.. అవి చూపించే నరకం అంతా ఇంతా కాదు.. అందుకే దోమల్ని తరిమేందుకు జనం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఓ తల్లి చేసిన అలాంటి ప్రయత్నమే పసిపాప ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ముక్కుపచ్చలారని చిన్నారి హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతోంది.
బరౌలా గ్రామానికి చెందిన ఓ మహిళ 11 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం రాత్రి దోమల బెడద ఎక్కువవడంతో పసిపాపను వాటి నుంచి రక్షించేందుకు పిడకల పొగ వేసి వాటిని తరిమేందుకు తల్లి ప్రయత్నించింది. బిడ్డను పడుకోబెట్టిన మంచం పక్కనే పిడకలు పెట్టి వాటిపై కొద్దిగా కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. అయితే ఆ మంటలు కాస్తా మంచంపై ఉన్న దుప్పటికి అంటుకున్నాడు. దీంతో చిన్నారి మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైంది.
తల్లి బిడ్డ అరుపులు ఏడుపు విన్న చుట్టుపక్కల వారు వచ్చి మంటల్ని ఆర్పేశారు. చిన్నారిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. ప్రాథమిక వైద్యం అందించిన డాక్టర్లు తీవ్ర గాయాలు కావడంతో పసిదాన్ని ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్కు రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ చిన్నారికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు. అయితే 11రోజుల పసిపాప మంటల్లో చిక్కుకున్న ఘటనపై స్థానికులు అనుమానం వ్యక్తంచేశారు.
ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో కుటుంబసభ్యులే పసిపాపను మంటల్లో కాల్చిచంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా చిన్నారి కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నించారు. అయితే విచారణలో అలాంటిదేమీ లేదని తేలింది. స్థానికులు చేస్తున్న ఆరోపణలు నిజమనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కొంతకాలంగా చిన్నారి తల్లి మానసిక స్థితి సరిగాలేదని పోలీసులు గుర్తించారు. అయితే ఆమె తన కన్నబిడ్డకు హాని కలిగించే పరిస్థితిలో లేదని స్పష్టం చేశారు.