కిరాణ వస్తువులకు పంపిస్తే.. అమ్మాయిని వెంటపెట్టుకొచ్చిన కొడుకు.. తల్లికి షాక్..
లాక్ డౌన్ వేళ ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కిరాణ వస్తువులు తీసుకెళ్లమని పంపిస్తే ఓ యువకుడు ఏకంగా ఓ అమ్మాయిని వెంటపెట్టుకుని ఇంటికొచ్చాడు. దీంతో ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు పరిగెత్తింది. ట్విస్ట్ ఏంటంటే.. ఇక్కడ అసలు విషయం తెలిసి పోలీసులు కూడా షాక్ తిన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా సహీదాబాద్కు చెందిన గుడ్డు(26), సవితా అనే యువతిని రెండు నెలల క్రితం హరిద్వార్లోని ఆర్య సమాజ్ మందిర్లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో మ్యారేజ్ సర్టిఫికెట్ పొందలేదు. దీంతో మరోసారి హరిద్వార్ వెళ్లి మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించాలని గుడ్డు భావించినప్పటికీ.. ఇంతలోనే లాక్ డౌన్ వచ్చిపడింది.
హరిద్వార్లో పెళ్లి తర్వాత ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఉన్న ఓ అద్దె ఇంట్లో సవిత నివాసముంటోంది. గుడ్డు మాత్రం కుటుంబ సభ్యులతో పాటు సహీదాబాద్లోని తన ఇంట్లోనే ఉండిపోయాడు. ఇదే క్రమంలో అతని తల్లి బుధవారం(ఏప్రిల్ 29)న కిరాణ వస్తువుల కోసం గుడ్డును బయటకు పంపించింది. కాసేపటికి తిరిగొచ్చిన గుడ్డు.. తనవెంట సవితను కూడా తీసుకొచ్చాడు. ఈ ఊహించని ఘటనకు నివ్వెరపోయిన అతని తల్లి కన్నీరుమున్నీరైంది. ఈ పెళ్లిని నేను ఒప్పుకోనంటూ పోలీస్ స్టేషన్కు పరిగెత్తింది.
Recommended Video
లాక్ డౌన్ కారణంగా అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో ఇంటి యజమానులు సవితను ఖాళీ చేయమని చెప్పారని.. దీంతో ఏదేమైనా సరే ఆమెను తన ఇంటికే తీసుకురావాలని నిశ్చయించుకున్నానని గుడ్డు చెప్పాడు. ఈ సమస్యకు పరిష్కారం కోసం పోలీసులు సవిత ఇంటి యజమానులతో మాట్లాడారు. లాక్ డౌన్ పీరియడ్ ముగిసేంతవరకు గుడ్డు-సవిత అక్కడే ఉంటారని,వారిని ఖాళీ చేయమని వేధించవద్దని చెప్పారు. దాంతో తాత్కాలిక పరిష్కారం దొరికినట్టయింది.