డ్రంకెన్ డ్రైవ్లో దొరికితే రూ.10వేలు ఫైన్: మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాల్లో ప్రపంచదేశాల్లో ప్రథమ స్థానంలో ఉంది భారత్. కొత్తగా సవరించిన మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వస్తే ఈ మరణాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 1988లో తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టం సవరణ చేసింది ప్రభుత్వం. ఈ సవరించిన బిల్లు జూలై 23న లోక్సభలో పాస్ అయ్యింది. ఇప్పుడు రాజ్యసభలో కూడా పాస్ కావడంతో త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఇక రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లు ఎదురుచూస్తోంది. భారత రహదారులపై వాహనాలను ఎలా నడపాలో, రవాణా వ్యవస్థలో భారీ మార్పులను చేస్తూ బిల్లులో పొందుపర్చారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేయడం, జరిమానాలు అమాంతంగా పెంచివేయడం వంటివి బిల్లులో పొందుపర్చింది ప్రభుత్వం. అంతేకాదు రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి కూడా మానవతా కోణంలో ఆర్థిక సహాయం కూడా చేస్తామని ప్రభుత్వం బిల్లులో పొందుపర్చింది.
పెనాల్టీలు ఈ విధంగా ఉన్నాయి
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.100గా ఉన్న ఫైన్ను రూ.500కు పెంచారు. ఇక పదేపదే ఉల్లంఘించేవారికి రూ.10వేలు వరకు జరిమానా విధించడం జరుగుతుంది. లైసైన్స్ దగ్గర లేకుండా వాహనంను నడిపితే ఇప్పటి వరకు రూ. 500 జరిమానా విధించేవారు. ఇప్పుడు దాన్ని రూ. 5000కు పెంచారు. సీటు బెల్టు ధరించకపోతే రూ. 1000 జరిమానా విధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు అది రూ. 100గా ఉన్నింది. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులకు జరిమానా రూ. 10వేలు విధిస్తారు. ఇప్పటి వరకు అది రూ. 2వేలుగా ఉంది. అతివేగంతో నడిపితే రూ. 5000 పెనాల్టీ విధిస్తారు. ఇక అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వాహనదారులకు రూ.10వేలు జరిమానా విధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి ప్రొవిజన్ బిల్లులో లేదు. దీన్ని కొత్తగా చేర్చారు. వాహనం యొక్క ఇన్ష్యూరెన్స్ ముగిసినప్పటికీ ఇంకా వాహనంను నడుపుతుంటే రూ. 2వేలు జరిమానా విధించడం జరుగుతుంది.
రోడ్డు నాణ్యత లేకుంటే కాంట్రాక్టర్లు దోషులే
అన్ని రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రైవర్లు కాదని చెబుతున్న కేంద్రం రోడ్డు ప్రమాదాలకు పలు కారణాలు ఉన్నాయని పేర్కొంది. నాణ్యమైన రోడ్లు వేయకుంటే కాంట్రాక్టర్లను దోషులుగా తేలుస్తామని కేంద్రం బిల్లులో పొందుపర్చింది. రోడ్డు నాణ్యత విషయంలో రాజీ పడకూడదని రోడ్లు కారణంగా మనిషి మృతి చెందితే కాంట్రాక్టరునే పట్టుకుంటామని బిల్లులో పేర్కొంది. మైనర్ల చేతికి వాహనం ఇస్తే.. వాహనం ప్రమాదానికి గురైతే వాహనం ఓనరుని కానీ.. లేక ఆ మైనర్ గార్డియన్ను కానీ విచారణ చేస్తామని బిల్లులో ఉంది. ఇక హిట్ అండ్ రన్ కేసుల్లో వ్యక్తి మృతి చెందితే పరిహారం కింద రూ. 25 వేలు ఇప్పటి వరకు ఉండేదని అయితే దీన్ని రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు బిల్లులో పొందుపర్చారు. గాయపడ్డవారికి అందే పరిహారం రూ.12,500 ఉండగా దాన్ని రూ.50వేలుకు పెంచారు. ఇక యాక్సిడెంట్ ఫండ్ను కూడా కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు బిల్లులో తెలిపారు. ఇక ప్రమాదం జరిగిన గంటలోనే చికిత్స చేసేందుకు ఎలాంటి డబ్బులు బాధితుడిని నుంచి తీసుకోకూడదని కూడా చట్టంలో పొందుపర్చారు.
ఏడాది లోపు లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చు
1988 చట్టం ప్రకారం ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 8వ తరగతి పాసై ఉండాలి. అయితే ఈ అర్హతను తొలగిస్తే ఏ డ్రైవింగ్ స్కూలు నుంచైనా సర్టిఫికేట్ ఉంటే లైసెన్స్ జారీ చేయొచ్చని కొత్తగా సవరించిన చట్టం పేర్కొంటోంది. ఒకవేళ లైసెన్స్ ఎక్స్పైరీ అయితే ఏడాది సమయంలోగా కొత్త లైసెన్స్ను రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది.ఇక ప్రైవేట్ క్యాబ్లు తమ క్యాబ్లను నడపాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుదని కొత్త చట్టంలో తెలిపారు. అంతేకాదు ఐటీ చట్టం 2000ను తాము లోబడి ఉంటామని సంతకం చేయాల్సి ఉంటుంది.