ఇక ఉగ్రవాదులకు మోటార్ సైకిళ్లు..! నగరానికి టెర్రర్ మరకలు..! ఎన్నైఏ సోదాలు..! ఏం జరుగుతోంది..?
హైదరాబాద్ : పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యంపై మరిన్ని తీవ్రమైన దాడులకు పాకిస్థానీ ఉగ్రసంస్థలు సిద్ధమయ్యాయి. కాకపోతే కార్లకు బదులు ఈసారి బైకులను వాడాలని నిర్ణయించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ మోటార్ సైకిల్ బాంబులతో విడతల వారీగా సాయుధ బలగాలపై దాడులు చేయాలని వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. పుల్వామా దాడి తర్వాత కార్లపై నిఘా పెరిగిపోవడంతో ఉగ్ర సంస్థలు ఈ మార్గాన్ని ఎంచుకొన్నాయి.
రూటు మార్చిన ఉగ్రవాదులు..! అప్రమత్తమైన భారత్..!!
ముఖ్యంగా శ్రీనగర్, కుప్వారా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలని ఉగ్రసంస్థలు ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఇందుకోసం కొందరిని సిద్ధం కూడా చేశాయి. ఈ ఆత్మాహుతి దాడులకు సిద్ధమైన బాంబర్లకు మొఘల్ చక్రవర్తుల పేర్లు పెట్టినట్లు నిఘా సంస్థలు పసిగట్టాయి. మోటార్ సైకిల్కు ఇరువైపులా పేలుడు పదార్థాలను పెట్టుకొని ముందే ఎంచుకున్న లక్ష్యాలపై దాడి చేసేలా ఈ ప్రణాళికలు ఉన్నాయట. కార్లతో పోల్చుకుంటే మోటార్ సైకిల్ లక్ష్యానికి మరింత సమీపంలోకి వెళ్లే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఉగ్రవాదులు ఏ రూపంలో నైనా ఎటాక్ చేయొచ్చు..! అప్రమత్తంగా ఉండాల్సిన సమయం..!!
పుల్వామా దాడి తర్వాత భారత్ స్పందించిన తీరుతో ఉగ్ర సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫిబ్రవరి 14 తర్వాత ఉగ్రవాదాన్ని అదుపు చేయాలని పాక్ పైనా భారీగా ఒత్తిడి పెరిగిపోయింది. దీనికి తోడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా పాక్ ను బ్లాక్ లిస్టులో చేర్చే అంశం ఉధృతంగా తెరపైకి రావడంతో పాక్ ఉగ్రమూకలపై ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ ఉగ్రమూకలు నిద్రాణ స్థితిలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
నగరానికి ఉగ్ర మరకలు..! సోదాలు నిర్వహించిన కేంద్ర దర్యాప్తు బలగాలు..!!
ఢిల్లీలో భారీ విధ్వంసాలకు కుట్ర చేసేందుకు హైదరాబాద్ యువకులు ప్లాన్ చేశారు. రెండేళ్ల క్రితం ముగ్గురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడికి యువకులు ప్లాన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రదాడి చేసేందుకు కెమికల్స్, డబ్బులను సమకూర్చుకున్నట్టు పేర్కొన్నారు. ఐఎస్ఐఎస్ ఢిల్లీ లో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్యకు ఆదేశించింది. ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్యకు బాసిత్ అనే యువకుడు ఢిల్లీ వెళ్లాడు. అయితే బాసిత్ తో పాటు నలుగురు యువకులకు ఏకే 47ను సమకూర్చారు. కుట్ర విఫలం కావడంతో ఢిల్లీ లో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ప్లాన్ అమలు కాకపోవడంతో బాసిత్ మాత్రం హైదరాబాద్ తిరిగొచ్చాడు. హైదరాబాద్ లో బాసిత్ తో పాటు మరో ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం..! కాశ్మీర్ లో ఉగ్రవాదిని అంతం చేసిన పోలీసులు..!!
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో గత రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో వారిపై బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. మిగతా ఉగ్రవాదుల కోసం బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.