ఉన్నావ్: ముగ్గురు పిల్లల తల్లిపై రేప్ చేస్తారా: బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలనం
లక్నో:దేశంలో అత్యాచార ఘటనలపై బిజెపి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ రేప్ కేసు ఘటనకు సంబంధించిన విషయమై బిజెపికి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశంలో సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై బీజేపీ నేతలు విచిత్రమైన రీతిలో స్పందిస్తున్నారు. నిన్న అత్యాచారాలు సంస్కృతిలో భాగం అని ఒకరంటే, నేడు అసలు ఆడపిల్లలను బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచి కాపల కాయలంటూ ఉత్తర్ప్రదేశ్లోని బైరియా నియోజకవర్గ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
ఉన్నావ్ ఘటనపై సురేంద్రసింగ్ స్పందించారు. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎమ్మెల్యేను సురేంద్ర సింగ్ వెనకేసుకొచ్చారు. ఎమ్మెల్యేపై ఇది రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. అసలు ఎవరైనా ముగ్గురు పిల్లల తల్లిని అత్యాచారం చేస్తారా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వారి తల్లిదండ్రులే బాధ్యత వహించాలని అసలు ఆడపిల్లలను స్వేచ్ఛగా తిరగకుండా వారిని కట్టడి చేయాలని అన్నారు.
పదిహేనేళ్ల పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి కాపలా కాయాలని, అలా కాకుండా వారిని ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. ఆడపిల్లలపై ఆత్యచారాలు జరగడానికి ఇదే ప్రధాన కారణం అని అన్నారు. అలాగే పిల్లలకు ఫోన్లు కొనివ్వకూడదని సూచించారు.