ఆర్టికల్ 370 రద్దుకు అనూహ్యంగా పెరుగుతున్న జాతీయ పార్టీల మద్దతు
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, దాన్ని రాష్ట్రంగా కాకుండా కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని పలు జాతీయ పార్టీలు స్వాగతించాయి. బీజేపీ అంటేనే నిప్పులు చిమ్మే పార్టీలు సైతం జమ్ముకశ్మీర్ విషయం వచ్చేసరికి పార్లమెంటులో మద్దతు తెలిపాయి. ఇందులో ప్రధానంగా మాయావతి పార్టీ బీఎస్పీ, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్లు ఉండటం విశేషం.
జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదన చేశారు. దీనిపై విపక్షాలు భగ్గుమనగా చాలా జాతీయ పార్టీలు ఇందుకు మద్దతు తెలిపాయి.బీజేపీకి ఆదినుంచి బద్ద శతృవుగా వ్యవహరించిన బీఎస్పీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు జమ్ము కశ్మీర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ప్రతిపాదనను స్వాగతించాయి. జమ్ముకశ్మీర్ను భారత్లో విలీనం చేసే సమయంలో కొన్ని షరతులు విధించారు. ఆ షరతులను ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంను మాయావతి అరవింద్ కేజ్రీవాల్లు స్వాగతించారు. ఇకపై జమ్ము కశ్మీర్లో శాంతి నెలకొని అభివృద్ధి పథం వైపు దూసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జమ్ముకశ్మీర్లో నివసించే ముస్లింలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు, ఇతర ప్రాంతాల్లో నివసించే ముస్లింలు జమ్ము కశ్మీర్లో ఆస్తులు ఎందుకు కొనకూడదని బీఎస్పీ ఎంపీ సతీష్ మిశ్రా ప్రశ్నించారు. ఈ పద్ధతి ఇకపై మారబోతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. నాడు సర్దార్ పటేల్ నెహ్రూకు ఇచ్చిన సూచనలను తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత చర్చ జరిగేది కాదని గుర్తుచేశారు.
ఆర్టికల్ 370 రద్దుకు వైసీపీ మద్దతు: మోదీకి హ్యాట్సాఫ్: కాశ్మీర్ ప్రజలకు కవిత మద్దతు..!
ఇదిలా ఉంటే శిరోమణి అకాళీదల్ పార్టీ కూడా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని స్వాగతించింది. అదే సమయంలో మైనార్టీల సంరక్షణ కేంద్రం తీసుకోవాలంటూ కేంద్రహోంశాఖ మంత్రిని ఆ పార్టీ ఎంపీ బల్వీందర్ సింగ్ కోరారు. ఇదిలా ఉంటే వైసీపీ కూడా ఈ ప్రతిపాదనను స్వాగతించింది. జమ్ము కశ్మీర్లో ప్రత్యేక అధికారాలు ఉండటం వల్ల చాలా అనర్థాలే జరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంను వైసీపీ స్వాగతిస్తోందన్నారు. జమ్మూ కశ్మీర్ పై ఉన్న భస్తాసుర హస్తాన్ని నేడు కేంద్రప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు.