కరుణానిధి శాఖాహారిగా ఎందుకు మారారంటే: చెప్పిన కనిమొళి
చెన్నై: ఇటీవల మృతి చెందిన కరుణానిధి శాఖాహారిగా మారడానికి కారణం ఏమిటో ఆయన కూతురు, ఎంపి కనిమొళి గుర్తు చేసుకున్నారు. అతను తాను పెంచుకున్న కుక్క మృతి తర్వాత మాంసాహారం తినడం మానేశారు.
కరుణానిధి అంతకుముందు మాంసాహారి. ఆ తర్వాత శాకాహారిగా మారారు. ఇదే విషయాన్ని కనిమొళి తాజాగా గుర్తు చేసుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె, ఒకే ఒక్క ఘటన ఆయనను మాంసాహారానికి దూరం చేసిందని తెలిపారు.
తన తండ్రి ఇంట్లో ఓ నల్లటి కుక్కను పెంచుకునేవారని, ఆయన ఇంట్లో ఉన్నంతసేపు అది వెన్నంటే ఉండేదని ఆమె తెలిపారు. తాను ఏది తింటే దానినే పెంపుడు కుక్కకు పెట్టేవారన్నారు. ఆ కుక్క అంటే తన తండ్రికి ఎంతో ఇష్టమని, ప్రేమ అన్నారు.
అయితే అది మరణించిన తర్వాత మాంసాహారాన్ని మానేశారని తెలిపారు. కుక్క మృతదేహాన్ని తమ ఇంటి వెనకున్న ఖాళీ స్థలంలోనే ఖననం చేశారన్నారు. అక్కడ ఓ మొక్కను నాటారని, ఇప్పుడు అది పెద్ద చెట్టుగా ఎదిగిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు.