ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు: ముగ్గురు మృతి, శిథిలాల్లో పలువురు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలిలో ఆదివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
సింగ్రౌలిలో తెల్లవారుజామున 4.30 గంటలకు బొగ్గును తీసుకెళుతున్న ఎన్టీపీసీ రైలు.. ఎదురుగా వస్తున్న మరో కార్గో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో లోకో పైలట్, అతని అసిస్టెంట్ కూడా ఉన్నారు.
లోకో పైలట్ రషీద్ అహ్మద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్కు చెందినవాడు కాగా, అసిస్టెంట్ లోకో పైలట్ మందీప్ కుమార్ ఉత్తరప్రదేశ్లోని రాబర్ట్స్గంజ్కు చెందిన వాడు. మరో మృతుడు పాయింట్స్ మ్యాన్ రామలక్ష్మణ్ సింగ్రౌలికి చెందినవారు.
ఈ రైళ్ల కింద పలువురు చిక్కుకోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ రైళ్లు పూర్తిగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలోనే నడుస్తాయని, రైల్వేకు సంబంధం ఉండదని కేంద్ర రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎన్టీపీసీ కోరడంతో రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.