కండీషన్స్ అప్లై: టీచర్లుగా ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకు వేతనాలు చెల్లిస్తామన్న యూజీసీ
న్యూఢిల్లీ: ప్రజాప్రతినిథులుగా ఎన్నుకోబడ్డ టీచర్లు, లెక్చరర్లు విద్యార్థులకు పాఠాలు బోధించడం కొనసాగిస్తే వారికి వేతనాలు చెల్లిస్తామంటూ యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ ప్రకటించింది. తాము రాజకీయాల్లోకి ప్రవేశింపక ముందు టీచర్గానో లేక లెక్చరర్గానో పనిచేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన వారు విద్యార్థులకు బోధన చేయొచ్చని స్పష్టం చేసింది. ఇక యూజీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో వారు తమ ఉద్యోగాలను కొనసాగిస్తే సంబంధిత విద్యాశాఖ నుంచి వేతనాలు చెల్లించబడుతాయని పేర్కొంది. ఇది ఎంపీగా ఎమ్మెల్యేలుగా ఉండగా వచ్చే వేతనాలతో సంబంధం లేదని వివరించింది.
ఇక అసెంబ్లీ లేదా పార్లమెంటు సమావేశాలకు హాజరైన సమయంలో వారిని హాజరు కిందకే పరిగణించాలని నిర్ణయం తీసుకుంది యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్. విద్యార్థులకు బోధన చేయడం మంచిపని అని గ్రహించిన రాజ్య సభ కమిటీ ... కమిటీ ప్రతిపాదనను మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని యూజీసీ చెప్పింది. ప్రజాస్వామ్యంలో తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఒక మంచి విద్యార్థిని సమాజానికి అందించడంలో చేస్తున్న కృషికి అడ్డం కాకూడదని ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పని భారం కూడా వీరికి ఎక్కువగా ఉండకూడదని యూజీసీ సంబంధిత యూనివర్శిటీలకు, విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు మానవవనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో అడుగుపెట్టేవారు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ చేయకూడదనేది చట్టంలో ఉంది. అయితే రాజ్యసభ కమిటీ టీచర్లకు, లెక్చరర్లకు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సారి లోక్సభకు ఎన్నికైన వారిలో చాలా తక్కువ మంది విద్యారంగంతో అసోసియేట్ అయి ఉన్నారని సమాచారం. మొత్తం మీద 8 మంది ఎంపీలు కాలేజ్ లెక్చరర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. 2014 లోక్సభకు 8మంది కాలేజ్ టీచర్లు ఎన్నికయ్యారు.
జాదవ్ యూనివర్శిటీలో సుగతా బోస్ తో పాటు మరో 20 మంది టీచర్లు లెక్చరర్లు రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు సభలోకి అడుగుపెట్టారు. ఇక 17వ లోక్సభ అంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఆగ్రా ఎంపీ సత్యపాల్ సింగ్ బాఘేల్ (బీజేపీ), స్థానిక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. బాలూర్ఘాట్ ఎంనీ సుకాంత మజుందార్ మాల్డాలోని గోర్బాంగా యూనివర్శిటీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఇక చెన్నై సౌత్కు చెందిన సుమతి, నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ, పెరంబలూర్ ఎంపీ పరీవేందర్లు ప్రముఖ విద్యావేత్తలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని రాన్ఘాట్ ఎంపీ జగన్నాథ్ సర్కార్, త్రిపుర ఈస్ట్ నుంచి రేబతి త్రిపురాలు స్కూలు టీచర్లుగా పనిచేస్తున్నారు.