నేనే పెద్ద సర్వేయర్ను: ఎగ్జిట్ పోల్ ఫలితాలపై శివరాజ్ సింగ్ చౌహాన్
భోపాల్: తానే అతిపెద్ద సర్వేయర్ను అని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు. ఎన్నికల అనంతరం పలు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కొన్ని బీజేపీకి అనుకూలంగా, మరికొన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు.
ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్లో వరుసగా నాలుగోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ఇది ఖాయమని శివరాజ్సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తిగా తానే అతిపెద్ద సర్వేయర్ను అని చెప్పారు. పోలింగ్ పైన తాను బాగా అంచనా వేయగలనని తెలిపారు.
దతియాలోని ప్రఖ్యాత శ్రీ పీతాంబర పీఠ్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని మీడియా ప్రతినిధులు ఆయనను అడిగారు. దీనిపై ఆయన పైవిధంగా స్పందించారు.
230 అసెంబ్లీ స్థానాలకు గాను ఈసారి తాము 200కు పైగా సీట్లు గెలుచుకుంటామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో సమాజంలోని అన్ని వర్గాల ఆశీస్సులు తమకు లభించాయని చెప్పారు. తన అంచనాల కంటే ఏ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మెరుగు కాదని అభిప్రాయపడ్డారు.