సీఎం బావను నాకే జరిమానా వేస్తారా?: వ్యక్తి వీరంగం(వీడియో), శిక్షతప్పదంటూ శివరాజ్ వార్నింగ్
Recommended Video
భోపాల్: ప్రజాప్రతినిధులు తమకు బంధువులంటూ పోలీసులను, అధికారులను తమ విధులను నిర్వర్తించుకోకుండా అడ్డుకునే వారిని చాలామందినే చూశాం. అయితే, ఇక్కడ మాత్రం నిబంధనలు అతిక్రమించే అలాంటి వారిని శిక్షించాల్సిందేనని ఏకంగా ముఖ్యమంత్రే స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఇలాంటి ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా కొందరు నిబంధనలను అతిక్రమించి తమ వాహనాలకు సైరన్ పెట్టుకుంటూ పోలీసులకు చిక్కుతున్నారు.
సైరన్ పెట్టుకున్నందుకు జరిమానా
ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో వీటిపై తనిఖీ నిర్వహించాలని ఎన్నికల సంఘం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర అసెంబ్లీ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. సైరన్తో వస్తున్న ఓ కారును అడ్డగించారు. నిబంధనలకు విరుద్ధంగా సైరన్ పెట్టుకున్నందుకు ఆ కారులోని వ్యక్తికి జరిమానా విధించారు పోలీసులు.
సీఎం బావనంటూ రచ్చ చేశాడు
దీంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సీఎం బావనని, తనకే జరిమానా విధిస్తారా? అంటూ వీరంగం సృష్టించాడు. అతడితోపాటు కారులో ప్రయాణిస్తున్న మహిళలు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇది సీఎం ఫోన్ నెంబర్.. ఫోన్ చేస్తున్నా.. అంటూ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి స్థానిక మీడియాలో వైరల్గా మారింది.
చౌహాన్ పేరిట రిజిస్ట్రేషన్..
కాగా, సీఎం బంధువులమని చెబుతున్న వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, సదరు కారు మాత్రం రాజేంద్ర సింగ్ చౌహాన్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
బావలు చాలమంది.. ఐనా శిక్షించాల్సిందే..
కాగా, ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘మధ్యప్రదేశ్లో నాకు చాలా మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. దీంతో నాకు బావలు కూడా ఎక్కువే ఉంటారు. అయితే, ఎవరైనా సరే నిబంధనలను అతిక్రమిస్తే న్యాయపరమైన చర్యలు తప్పవు' అంటూ సీఎం చౌహాన్ హెచ్చరించారు.