ఆరుగురు మంత్రులపై వేటు.. సింధియా మెడకు కేసుల ఉచ్చు.. కాంగ్రెస్ రివర్స్ గేమ్.. ఫలితం?
మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రమాదంలో పడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అయితే దానికంటే ముందు రెబల్స్ రాజీనామాలు, వాళ్లను కొనేందుకు బీజేపీ సాగించిన బేరసారాలపై క్లారిటీ రావాలని మెలిక పెట్టింది. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో సదరు రెబల్స్ గురువారం సాయంత్రానికి భోపాల్ చేరుకున్నారు. కాంగ్రెస్-బీజేపీ మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉండటంతో ఎయిర్ పోర్టుతోపాటు సిటీలోని కీలక ప్రదేశాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు సంక్షోభానికి కారకుడైన జ్యోతిరాదిత్య సింధియా మెడకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది.
గవర్నర్ తో కీలక చర్చలు
22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిన నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. సీఎం కమల్ నాథ్ గురువారం గవర్నర్ లాల్జీ టండన్ ను కలిసి.. బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఫ్లోర్ టెస్టు కంటే ముందు తిరుగుబావుటా ఎగరేసిన ఆరుగురు మంత్రుల్ని తొలగించాలని రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్ష బీజేపీ ఎన్ని కుట్రలు చేసిందో వివరించారు. బెంగళూరు రిసార్ట్సులో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను భోపాల్ కు రప్పించే చర్యలు తీసుకోవాలనీ గవర్నర్ ను సీఎం కోరారు. సుమారు గంటన్నరపాటు సీఎం రాజ్ భవన్ లోనే గడిపారు.
మంత్రులపై వేటు..
సీఎంతో భేటీ ముగిసిన కొద్దిసేపటికే గవర్నర్ టండన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మంత్రులైన ఇమార్తీ దేవి, తులసీ సిల్వాత్, గోవింద్ సింగ్ రాజ్ పుత్, మహేంద్ర సింగ్ సిసోడియా, ప్రద్యుమ్న సింగ్ తోమర్, ప్రభురాం చౌదరిలపై వేటు వేస్తూ ఉత్తర్వులిచ్చారు. సీఎం రిక్వెస్ట్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
భోపాల్కు రెబ్సల్స్.. టెన్షన్..
సింధియా వర్గానికి చెందిన 19 మంది రెబల్ ఎమ్మెల్యేలు శుక్రవారం సాయంత్రం భోపాల్ సిటీకి చేరుకున్నారు. రాజీనామాల విషయంలో తన ముందు హాజరుకావాలంటూ స్పీకర్ ప్రజాప్రతి ఇచ్చిన డెడ్ లైన్ మేరకు వాళ్లంతా బెంగళూరు రిసార్ట్సు నుంచి హుటాహుటిన రాష్ట్రానికి వచ్చారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ బలవంతంగా బంధించిందంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు కూడా రెబల్స్ కు మద్దతుగా నిలబడే ప్రపయత్నం చేశారు. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో ఎయిర్ పోర్టుతోపాటు రాజ్ భవన్, అసెంబ్లీ తదితర కీలక ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి.. కాంగ్రెస్ రెబల్స్ స్పీకర్ కార్యాలయానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. పట్టుపట్టి మంత్రులపై వేటు వేయించారుగానీ... రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై కాంగ్రెస్ ఎలా వ్యవహరించబోతున్నదనేది సస్పెన్స్ గా మారింది.
జ్యోతిరాదిత్యపై ప్రతీకారం..
మధ్యప్రదేశ్ పొలిటికల్ క్రైసిస్ కు బాధ్యుడు.. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, తానూ బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాపై కమల్ నాథ్ సర్కార్ కన్నెర్రజేసింది. సింధియా నిందితుడిగా నిరూపితమయ్యే ఓ పాత కేసును మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) శుక్రవారం రీఓపెన్ చేసింది. ఉన్న భూమిని తక్కువ చేసి చూపించడం ద్వారా సిందియా కుటుంబం లాభపడిందంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుకాగా, అప్పట్లో ఆధారాలు లేవన్న సాకుతో కేసును పక్కన పెట్టారు. తాజాగా రాజకీయ సమీకరణాలు మారడంతో మరోసారి ఆ కేసును తిరగదోడేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు రెడీ అయ్యారు. ఇది ముమ్మాటికీ ప్రతీకార చర్యేనని సింధియా వర్గీయులు అంటున్నారు.