రేపటిలోగా బలం నిరూపించుకోండి: మధ్యప్రదేశ్ సర్కారుకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి రేపటితో తెరపడనుంది. మధ్యప్రదేశ్లోని కమల్ నాథ్ ప్రభుత్వం శుక్రవారం(మార్చి 20) సాయంత్రం 5 గంటలలోగా బలనిరూపణ పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బలనిరూపణకు ఆదేశించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అంతేగాక, అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షను వీడియో తీయాలని ఆదేశించింది.
కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 22 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ సర్కారు మైనార్టీలో పడిపోయింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ బలం నిరూపించుకోవాలంటూ బీజేపీ సవాల్ విసిరింది. అయితే, కాంగ్రెస్ మాత్రం కరోనావైరస్ పేరుతో అసెంబ్లీని వాయిదా వేసింది. దీంతో బలనిరూపణకు ఆదేశాలు జారీ చేయాలంటూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు శుక్రవారం కమల్ నాథ్ సర్కారు బలం నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. దీంతో రేపు కమల్ నాథ్ ప్రభుత్వం భవితవ్యం తేలనుంది.
Recommended Video
కాగా, 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ బలం 92కు పడిపోయింది. ఇక బీజేపీకి అసెంబ్లీలో 107 సీట్లున్నాయి. దీంతో అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి.. తమ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది.