రూ.2.5 లక్షలిస్తే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తాం: టెక్కీ ఆఫర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
భోపాల్: డబ్బులు ఇస్తే తాను ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తానని ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ మధ్యప్రదేశ్లో సంచలనానికి తెరలేపాడు. ఇప్పటికే ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఓ టెక్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని బింద్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ అభ్యర్థికి బంపరాఫర్
బింద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రమేష్ దుబేకు దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ సాఫ్టువేర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు! ఒక్కో ఈవీఎంకు రూ.2.5 లక్షల చొప్పున ఇస్తే తాను ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తానని, మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చేలా చూస్తానని చెప్పాడు.
టెక్కీని పిలిపించుకున్నాడు
సదరు ఢిల్లీ టెక్కీ ఆఫర్ విని సదరు అభ్యర్థి మధ్యప్రదేశ్ పిలిపించుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. ట్యాంపరింగ్ విషయమై మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి అభయ్ జోషి (30) అనే వ్యక్తి గ్వాలియర్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ కూడా అక్కడికి వెళ్లి అతనితో మాట్లాడాడు.
ఓ దృశ్యాన్ని చూపించాడు
తాము ఏ విధంగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తామో రమేష్కు అతను వివరించాడు. తన సెల్ఫోన్లో ఇందుకు సంబంధించిన ఓ దృశ్యాన్ని ఆయన చూపించాడు. ఇందుకు ఒక్కో ఈవీఎంకు రెండున్నర లక్షల రూపాయలు తీసుకుంటానని మరోసారి చెప్పాడు. కొన్ని సర్క్యూట్ల ద్వారా తాము ఈవీఎంలను ప్రభావితం చేస్తామన్నాడు.
డబ్బు కోసమే నాటకాలు
అప్పటికే అక్కడకు పోలీసులు చేరుకొని, నిందితుడిని అరెస్టు చేసారు. ఈ కేసుపై క్వాలియర్ ఎస్పీ నవనీత్ బాసిన్ మాట్లాడారు. తాము నిందితుడు జోషిని విచారిస్తున్నామని చెప్పారు. ఢిల్లీకి పోలీసులను పంపించి అతని ఇంట్లో సోదాలు చేయిస్తున్నామని చెప్పారు. అతను కేవలం డబ్బు కోసమే అభ్యర్థులను ట్యాంపరింగ్ పేరుతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని ప్రాథమికంగా తేలినట్లు చెప్పారు.