మధ్యప్రదేశ్లో రైతుకు షాక్: రూ.24వేల బదులు రూ.13 రుణమాఫీ
భోపాల్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కమల్ నాథ్ ప్రభుత్వం రైతులకు షాకిచ్చింది! తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఓ రైతుకు రూ.24వేల రుణమాఫీకి బదులు కేవలం రూ.13 అయింది. ఇది తెలిసి ఆ రైతు అవాక్కయ్యారు.
రుణమాఫీకి అధికారులు సంబంధించిన లిస్టును బుధవారం విడుదల చేశారు. ఇందులో శివలాల్ కటారియా అనే రైతు తనకు మాఫీ అయిన రుణాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల దాకా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పింది.
దీంతో రైతులు తాము తీసుకొన్న రుణాల వివరాలను అధికారులకు ఇచ్చారు. అగర్ మాల్వా జిల్లాలోని నిపానియా బైజ్నాథ్ గ్రామానికి చెందిన శివలాల్ అనే రైతు కూడా తాను తీసుకొన్న దాదాపు రూ.24వేల రుణం వివరాలను అందించారు. రుణం మాఫీ అవుతుందని ఆయన భావించారు.
కానీ కేవలం రూ.13 మాత్రమే మాఫీ కావడంతో ఏం చేయాలో ఆయనకు పాలుపోలేదు. దీనిపై అధికారులను నిలదీశారు. రుణమాఫీ ప్రకటించిన రోజుకి తన పేరు మీద ఎటువంటి అప్పు లేదని చెప్తున్నారని, ఈ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని శివలాల్ ఆరోపించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే అవకతవకలు సరి చేస్తామని ప్రభుత్వం చెప్పింది.