అయోధ్య రామ మందిర నిర్మాణానికి గౌతమ్ గంభీర్ భారీ విరాళం
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి టీమిండియా మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ భారీ విరాళం అందించారు. తన వంతుగా రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. దేశ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ అద్భుత కట్టడం నిర్మాణానికి తాను, తన కుటుంబం తరపున ఈ విరాళం అందజేసినట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో అద్భుతమైన రామమందిర నిర్మాణం భారతీయులందరి కల అని అన్నారు గంభీర్. మందిర నిర్మాణంపై సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు తెరపడటంతో ఐక్యత, ప్రశాంతత మార్గం సుగమమైందని అన్నారు. ఇందులో తమవంతుగా చిన్న సాయం అందించినట్లు చెప్పారు.
కాగా, మందిర నిర్మాణం కోసం ప్రజల నుంచి కూపన్ల ద్వారా విరాళాలు సేకరించేందుకు ఢిల్లీ బీజేపీ ప్రచారం ప్రారంభించింది. రూ. 10, రూ. 100, రూ. 1000ల చొప్పున కూపన్లతో విరాళాలు సేకరించేందుకు నిర్ణయించినట్లు ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, కూపన్ల సేకరణ ప్రచార కన్వీనర్ కుల్జీత్ చాచల్ తెలిపారు. రూ. 1000కిపైగా ఉంటే చెక్కుల రూపంలో ఇవ్వవచ్చన్నారు. విరాళాల సేకరణ కోసం ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు చాచల్ తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్న విషయం తెలిసిందే.