లాక్డౌన్ ఎఫెక్ట్: సొంతూరుకు వెళ్లాలని .. 200 కిలోమీటర్లు నడిచి మృతి చెందిన వ్యక్తి
న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అయితే లాక్డౌన్తో పలు పరిశ్రమలు మూతపడటంతో అక్కడి కార్మికులకు ఏం చేయాలో తోచడం లేదు. దీంతో సొంత ఊళ్లకు పయనమయ్యారు. అయితే సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని సొంత గ్రామాలకు కాలినడకన బయలుదేరారు. వారి సొంతూళ్లు చాలా దూరంగా ఉన్నప్పటికీ కాలినడకపైనే బయలుదేరారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మృతి చెందాడు.
కాలినడకపై సొంతూరుకు..
మధ్యప్రదేశ్కు చెందిన ఓ 39 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. దేశంలో లాక్డౌన్ ఉండటంతో మధ్యప్రదేశ్లోని తన సొంతూరు మొరేనాకు బయలుదేరాడు. అయితే ఏవాహనంలోనో బయలుదేరలేదు. కాలినడకన బయలుదేరాడు. ఢిల్లీ నుంచి కాలినడకన బయలుదేరిని వ్యక్తి దాదాపు 200 కిలోమీటర్లు మేరా నడిచి ఢిల్లీ - ఆగ్రా హైవేపై ఒక్కసారిగా కుప్పకూలాడు. చనిపోయిన వ్యక్తిని రన్వీర్ సింగ్గా గుర్తించారు. 21 రోజులపాటు అన్ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో రనవీర్ సింగ్ కాలినడకన సొంతగ్రామానికి బయలుదేరాడు. తను ఢిల్లీలో హోమ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు.
మరో 100 కిలోమీటర్లు ఉందనగా..
తన సొంతూరుకు వెళ్లాలంటూ బయలుదేరిన రన్వీర్ సింగ్ అప్పటికే 200 కిలోమీటర్లు మేరా నడిచాడు. ఇక తన గ్రామం మరో 100 కిలోమీటర్లు దూరం ఉందనగా తనకు గుండెలో నొప్పి ప్రారంభమైనట్లు తన తోటి వారితో చెప్పాడు. ఇక అలా చెబుతూ నడుస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికంగా ఉండే లోకల్ హార్డ్వేర్ స్టోర్ యజమాని సంజయ్ గుప్తా రన్వీర్ సింగ్ పడిపోవడాన్ని గుర్తించి అతని దగ్గరకు పరుగులు తీశాడు. అతన్ని ఓ పక్కన పడుకోబెట్టి టీ, బిస్కెట్లు ఇచ్చినట్లు గుప్తా చెప్పాడు. అనంతరం తన పరిస్థితి గురించి ఫోన్లో రన్వీర్ సింగ్ తన బావ అరవింద్ సింగ్కు ఫోన్ చేసి చెప్పినట్లు గుప్తా చెప్పాడు. ఇక తనకు గుండెల్లో నొప్పిగా ఉందని కూడా చెప్పినట్లు గుప్తా వివరించాడు. సాయంత్రం 6:30 గంటల సమయంలో రన్వీర్ సింగ్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
200 కిలోమీటర్లు నడవడంతో గుండెపోటు...
శుక్రవారం ఉదయం కాలినడకన ఢిల్లీ నుంచి తన సొంత గ్రామానికి రన్వీర్ సింగ్ బయలుదేరాడు. 200 కిలోమీటర్లు మేరా నడవడంతో అలిసిపోయి గుండె నొప్పి వచ్చి ఉంటుందని పోలీసులు చెప్పారు. అయితే ఇలా కాలినడకన వచ్చేవారికోసం ఆహారం నీళ్లతో పోలీసులు సిద్ధంగా ఉన్నారని అయితే రన్వీర్ సింగ్ మృతి దురదృష్టకరమన్నారు స్టేషన్ హౌజ్ ఆఫీసర్. రన్వీర్ సింగ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు పంపారు. నివేదిక రావాల్సి ఉంది. గత మూడేళ్లుగా ఢిల్లీలోని తుగ్లకాబాద్లో ఓ హోటల్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్లు సమాచారం. రన్వీర్ సింగ్కు ముగ్గురు పిల్లలని అందులో ఇద్దరు ఆడపిల్లలని పోలీసులు తెలిపారు.