అమానుషం... దళితుడు తమ ఇంట్లో భోజనం చేశాడని కొట్టి చంపేశారు...
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. విందు జరిగిన ఓ ఇంట్లో ఎంగిలి విస్తార్లు ఎత్తేందుకు ఓ దళితుడిని పిలిచారు. అంతా శుభ్రం చేసిన ఆ దళితుడు.. విందులో అన్నం మిగిలిపోవడం గమనించి తనకు తానే కాస్త వడ్డించుకుని తినడం మొదలుపెట్టాడు. అంతే... ఆ దళితుడు అన్నం తినడం గమనించిన ఆ ఇంటి వ్యక్తులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ప్రపంచం చాలా అభివృద్ది చెందిందని గొప్పగా చెప్పుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇంకా కులం పేరుతో భారత్లో దాడులు జరుగుతుండటం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే...
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఉన్న కిషన్పూర్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం(డిసెంబర్ 7) విందు జరిగింది. ఆ ఇంటికి చెందిన బూరా సోనీ,సంతోష్ పాల్ అనే ఇద్దరు వ్యక్తులు... విందు అనంతరం అక్కడ అంతా శుభ్రం చేసేందుకు దేవరాజ్ అనురాగి అనే దళితుడిని పిలిపించారు. వాళ్లు చెప్పినట్లే ఇళ్లంతా శుభ్రం చేసిన ఆ దళితుడు... విందులో ఆహార పదార్థాలు మిగిలిపోవడం గమనించి తనకు తానే వడ్డించుకుని తినడం మొదలుపెట్టాడు.
కర్రలతో కొట్టి చంపేశారు...
ఇంతలో అక్కడికి వచ్చిన బూరా సోనీ,సంతోష్ పాల్ అనురాగిపై ఆగ్రహంతో ఊగిపోతూ కర్రలతో దాడి చేశారు. దళితుడివై ఉండి తమ ఇంట్లో భోజనం చేస్తావా అని విచక్షణారహితంగా అతన్ని కొట్టి చంపేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ సచిన్ శర్మ దీనిపైమాట్లాడుతూ... ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు.వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ ఇద్దరు అగ్ర కులాలకు చెందిన వ్యక్తులుగా తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఆగని దాడులు...
దేశంలో దళితులపై ఇలాంటి కొత్తేమీ కాదు. 2018లో ఓ దళిత యువకుడు అగ్రవర్ణాలు ఆరాధించే దేవుడి పల్లకిని తాకాడని ఆ అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు అతన్ని కొట్టి చంపారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. పెళ్లి విందులో అగ్ర కులాల ఎదురుగా కూర్చొని భోజనం చేశాడన్న కారణంతో 21 ఏళ్ల యువకుడిని కొట్టి చంపిన ఘటన గతేడాది డెహ్రాడూన్లో జరిగింది. ఈ ఏడాది గుజరాత్లో ఓ దళిత పెళ్లి కొడుకు గుర్రంపై ఎక్కి ఊరేగాడన్న కారణంతో అక్కడి అగ్ర వర్ణాలు దాడికి పాల్పడ్డారు. దేశంలో దళితులను ఇప్పటికీ అంటరానివాళ్లుగా పరిగణిస్తూ వాళ్లపై దాడులు చేస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.