వైరల్ వీడియో : ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసిన మంత్రి.. నెటిజన్ల ప్రశంసలు
ఇండోర్ : మంత్రి ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు. తాను వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వెంటనే స్పందించారు. ఆయన కారులోంచి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మధ్య ప్రదేశ్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా మంత్రి పదవి అనగానే ఫోజులు కొట్టే నేతలున్న మన దేశంలో సదరు మంత్రి స్పందించిన తీరు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సర్పంచ్ స్థాయి నుంచి మచ్చ లేని వ్యక్తినంటూ..
మధ్య ప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి జితూ పట్వారీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై చర్చానీయాంశంగా మారారు. ఆయన చేసిన పనికి పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంగళవారం నాడు ఇండోర్లో ఆయన వెళుతున్న మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొద్దిసేపు వేచి చూసే ధోరణిలో ఆయన అలాగే ఉండిపోయారు. కానీ ఎంతకు ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఆయన స్పందించారు.
తన వాహనంలో నుంచి కిందకు దిగిన సదరు మంత్రి ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు రంగంలోకి దిగారు. సాక్షాత్తూ మంత్రి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించడంతో వాహనదారులు కూడా ఆయనకు సహకరించారు. అలా వాహనదారులకు ఆదేశాలు ఇస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఆ క్రమంలో కొద్ది సేపట్లోనే అక్కడ ట్రాఫిక్ జామ్ తగ్గిపోయింది. దాంతో వాహనదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సదరు వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో మంత్రి గారి పనితీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
#WATCH: Madhya Pradesh Sports Minister, Jitu Patwari, helped in managing traffic after he got stuck in a traffic jam in Indore, yesterday. #MadhyaPradesh pic.twitter.com/HILkS4fFcl
— ANI (@ANI) September 10, 2019