పులులనూ సింహాలనూ పెంచుకోనివ్వండి: ఎంపి మంత్రి
న్యూఢిల్లీ: పిల్లులకు మాదిరిగానే పులులను, సింహాలను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని, అందుకు అనుగుణంగా చట్టాలను సరిచేయాలని మధ్యప్రదేశ్ మంత్రి కుసుమ్ మెహ్దెలే కోరారు. పశు సంరక్షణ, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి అయిన కుసుమ్ మెహ్దెలె రాష్ట్ర అటవీ శాఖకు ఆ మేరకు ప్రతిపాదన పంపించారు. విదేశాల్లో ఉన్నట్లు ఇక్కడ కూడా పెంచుకునేందుకు అనుమతివ్వాలంటూ ఆమె అటవీశాఖ అధికారులకు లేఖరాశారు.
థాయ్లాండ్తోపాటు కొన్ని ఆగ్నేయ ఆసియా దేశాల్లో, కొన్ని ఆఫ్రికా దేశాల్లో పులులు పెంచుకునేందుకు న్యాయపరంగా ఇబ్బందుల్లేవని ఆమె అన్నారు. అక్కడ అలాంటి చర్యలు తీసుకోవటం ద్వారా పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఇండియాలో ఇందుకోసం కోట్లు వెచ్చిస్తున్నా పెద్దగా ప్రయోజనం లేదన్నారు. నిరుడు సెప్టెంబర్లోనే కుసుమ్ ఈ లేఖరాసినా, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
భోపాల్కు చెందిన అజయ్ దుబే అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో 2010లో 1,706 ఉన్న పులుల సంఖ్య 2014 కల్లా 2,226కు చేరిందని తెలిపారు. ఇంట్లో పులులు పెంచుకునేందుకు అనుమతివ్వాలన్న మంత్రి ఆలోచనను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖరాస్తానన్నారు. మంత్రి కుసుమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పన్నా అభయారణ్యంలో పులుల సంఖ్య రెట్టింపు అయిన విషయాన్ని అజయ్ దుబే గుర్తుచేశారు.
మంత్రి సూచనపై అభిప్రాయం కోరుతూ మధ్యప్రదేశ్ ఫారెస్టు ప్రిన్సిపుల్ చీఫ్ కన్జర్వేటర్ నరేంద్ర కుమార్ జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టిసిఎ), భారత వన్యప్రాణుల సంస్థలకు లేఖ రాశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరు పులుల సంరక్షణ కేంద్రాలున్నాయి. బంధవగడ్, కన్హా, పన్నా, బోరీ - సాత్పురా, సంజయ్ - దుబ్రీ, పెంచ్ల్లో 257 పులులున్నాయి.