ఢిల్లీ అల్లర్లు : ఇంత నిర్లక్ష్యమా..? ఎంపీ ఫిర్యాదు చేసినా లెక్కచేయరా..
ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని శిరోమణి అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్ ఆరోపించారు. అల్లరి మూకల చేతిలో దాడులకు గురవుతున్నవారిని రక్షించాల్సిందిగా తాను చేసిన విజ్ఞప్తిని పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇదంతా చూస్తుంటే.. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత గుర్తుకొస్తుందన్నారు. అల్లర్ల సమయంలో కొన్ని ప్రాంతాల్లోని మైనారిటీలు తమ ఆస్తులకు,ప్రాణాలకు పోలీస్ రక్షణ లేకుండా పోయిందని భయాందోళన చెందారని.. ఇలాంటి ఘటనలే 1984లో సిక్కుల ఊచకోత సమయంలోనూ చూశామన్నారు. జరిగిన పరిణామాలు షాకింగ్గా ఉన్నాయని.. అందులో పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్కి ఆయన లేఖ రాశారు.
లేఖలో ఏముంది..
'ఆరోజు రాత్రి 11.30గంటలకు నాకొక ఫోన్ కాల్ వచ్చింది. తనతో పాటు మరో 15 మంది ముస్లింలు మౌజ్పూర్లోని గోందా చౌక్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో చిక్కుకుపోయినట్టు ఓ వ్యక్తి ఫోన్లో చెప్పాడు. ఇంటి బయటే ఉన్న అల్లరి మూకలు లోపలికి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని.. తమను రక్షించాలని కోరాడు. నేను వెంటనే 100 కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ఫోన్ చేసిన ఆ వ్యక్తి నంబర్ కూడా ఇచ్చాను.' అని లేఖలో పేర్కొన్నారు.
పోలీసుల నిర్లక్ష్యం..
'అక్కడి పరిస్థితి గురించి వివరించడంతో పాటు.. తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరాను. నేనో ఎంపీని అని కూడా చెప్పాను. 11.43గంటల సమయంలో నా ఫిర్యాదును స్వీకరించినట్టు సెల్ఫోన్కు మెసేజ్ వచ్చింది. కానీ బాధాకరం ఏంటంటే.. ఢిల్లీ పోలీసులు నా ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ చిక్కుకుపోయిన 16 మందికి ఎలాంటి సహాయం అందలేదు.' అని చెప్పారు.
కాపాడిన హిందువులు...
'అదృష్టవశాత్తు అక్కడే ఉన్న కొంతమంది ఇరుగుపొరుగు హిందువులు వారికి రక్షణగా నిలవడంతో దాడి నుంచి తప్పించుకున్నారు. ఒక ఎంపీ హోదాలో ఉండి నేను చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదంటే.. ఈశాన్య ఢిల్లీ తగలబడుతుంటే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆశ్చర్యమేముంది.' అని పేర్కొన్నారు.
38కి చేరిన మృతుల సంఖ్య
ఢిల్లీ అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 38కి చేరింది. దాదాపు 200 పైచిలుకు మంది గాయపడ్డారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కేంద్ర హోంశాఖ విఫలమైందని విమర్శిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఇప్పటికే డిమాండ్ చేసింది. అటు అంతర్జాతీయంగానూ ఢిల్లీ అల్లర్లపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 106 మందిని అరెస్టు చేయగా.. 18 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అల్లర్లపై రెండు సిట్ టీమ్స్ విచారణ జరుపుతున్నాయి.