లోక్సభలో శివమెత్తిన సినీనటి, ఎంపీ నవనీత్ కౌర్.. రైతుల కష్టాలకు, మహా సంక్షోభానికి కారణం మీరే అంటూ..
లోక్సభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే లోక్సభలో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. పలు అంశాల చర్చకు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర రైతుల సమస్యను సభలో ప్రసావించి స్వతంత్ర ఎంపీ, సినీ నటి నవనీత్ రాణా ఆకట్టుకొన్నారు. నవనీత్ కౌర్ తెలుగు ప్రేక్షకులకు నటిగా సుపరిచతం. గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే.
తాజాగా లోక్సభలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడానికి కారణం శివసేననే అంటూ తీవ్రమైన దాడి చేసింది. శివసేన సభ్యులు అడ్డుతగలకగా.. తన వాడి వేడి ప్రసంగంతో నవనీత్ రాణా ఘాటుగా స్పందించారు. స్వార్ధపూరితర రాజకీయాల కారణంగానే రైతులు ఇంకా కష్టాల్లో మగ్గుతున్నారని ఆమె అన్నారు. ఇంకా తన ప్రసంగంలో శివసేనపై నవనీత్ కౌర్ ఎలా శివమెత్తారంటే...
శివసేన స్వార్ధం వల్లనే
శివసేన ఎంపీలు సభలో రైతులు గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. సభలో వారు ప్రశ్నించడం ప్రజలు చూస్తున్నారు. రైతుల సమస్యలు తీరుస్తారని అసెంబ్లీలో వారికి మెజారిటీ ఇచ్చారు. కానీ వాళ్ల స్వార్ధం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకొన్నారు. రైతుల సమస్యలను గాలికి వదిలేశారు అని శివసేన పార్టీపై నవనీత్ రాణా మండిపడ్డారు.
శివసేనకు రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు. మహారాష్ట్ర నుంచి ఎన్నికైన ఎంపీగా రైతుల సమస్యను మాట్లాడుతాను. నా ప్రసంగాన్ని ఎవరు అడ్డుకోలేరు. రైతుల గురించి మీ అభిప్రాయాన్ని చెప్పారు. దానికి నేను అడ్డుపడలేదు. నా అభిప్రాయాన్ని వెల్లడించకుండా అడ్డుకోవడం సరికాదు. శివసేనకు రైతుల పట్ల ప్రేమ లేదు అని నవనీత్ రాణా పేర్కొన్నారు.
రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదు
ఒకవేళ మహారాష్ట్రలో రైతుల సమస్యలను పరిష్కరించే విషయంలో చిత్తశుద్ది ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు. కానీ వారు తమ స్వార్ధం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుపుల్ల వేశారు. అంతేకాకుండా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు ప్రధాన కారణమయ్యారు. ఇక మహారాష్ట్రలో పేరుకుపోయిన కరువు, క్షామానికి పరోక్షంగా మరోసారి కారణమవుతున్నారు అని నవనీత్ కౌర్ అని విమర్శల వర్షం కురిపించారు.
రాష్ట్రపతి పాలనకు కారణం శివసేననే
సొంత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కారణం శివసేననే అని సభాముఖంగా చెబుతాను. అంతేకాకుండా సొంత ఇంటిని సంరక్షించుకోకుని శివసేనను ఎండగట్టడానికి నేను ఏ మాత్రం వెనుకడుగు వేయనని చెప్పారు. అంతేకాకుండా సభలో నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అది సమంజసం కాదన్నారు. రైతుల సంక్షేమం కోసం పాటుపడితే మద్దతు ఇస్తాను. ఒకవేళ రైతులను పట్టించుకోకపోతే వారిని విమర్శించడానికి ఏమాత్రం సంకోచించను అని నవనీత్ కౌర్ మాటల తూటాలను పేల్చారు.
రైతుల సమస్యలను ప్రత్యక్షంగా చూశా
రైతులు సమస్య గురించి మాట్లాడేటప్పు సభాధ్యక్షుడు సమయం ఇవ్వాలని నవనీత్ కౌర్ కోరారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని కరువు జిల్లాలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాను. ప్రతీ ప్రాంతంలోని ప్రజలు, రైతులు సమస్యను నేను ప్రత్యక్షంగా చూడటమేకాకుండా తెలుసుకొన్నాను. అకాల వర్షాల వల్లసోయాబిన్, కందులు, ఇతర ధాన్యాల పంటలకు సంబంధించి విపరీతమైన నష్టం వాటిల్లింది. ఈ విషయంలో మహారాష్ట్రలో ప్రధాన పార్టీలకు ఎలాంటి పట్టింపు లేదు అని నవనీత్ కౌర్ ఆరోపించారు.
శివసేనపై నమ్మకం లేకే కేంద్రం దృష్టికి
రాష్ట్రంలో పార్టీల తీరు నచ్చకపోవడం వల్లనే, రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువస్తున్నాను. మహారాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యత కేంద్రానికి ఉందని భావించినందునే ఈ విషయాన్ని సభలో ప్రస్తావిస్తున్నాను. మహారాష్ట్ర రైతుల కన్నీటిని తుడవడానికి కేంద్ర రూ.50 వేల కోట్లు తక్షణ అవసరం ఉంది. కాబట్టి వాటిని వెంటనే విడుదల చేసి రైతులను బాధలను దూరం చేయాలి. రైతుల కళ్లలో వెలుగులు నింపగలిగే బాధ్యత కేంద్రంపైనే ఉందని నవనీత్ రాణా ఘాటుగా స్పందించారు.
నవనీత్ కౌర్ నటి నుంచి పొలిటిషియన్గా
నవనీత్ కౌర్ తెలుగులో డజనకుపైగా చిత్రాల్లో నటించారు. శ్రీను వాసంతి లక్ష్మీ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన ఆమె డజనుకుపైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో జగపతి, మహారధి, యమదొంగ, జాబిలమ్మ, లవ్ ఇన్ సింగపూర్, కాలచక్రం లాంటి చిత్రాలతోపాటు హిందీ, తమిళ, కన్నడ, పంజాబీ, మలయాళ సినీ పరిశ్రమలో రాణించారు. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన రవి రాణాను వివాహం చేసుకొని నవనీత్ రాణాగా మారారు. ప్రస్తుత లోక్సభలో ఎంపీగా కొనసాగుతున్నారు.