ఉప ఎన్నికల్లో బీజేపీకి నిరాశే: ఎంపీలో సిట్టింగ్ చేజిక్కించుకున్న కాంగ్రెస్, ఒడిశాలో బీజేడీ గెలుపు
భోపాల్/భువనేశ్వర్: మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చేదు అనుభవమే ఎదురైంది. మధ్యప్రదేశ్లోని ముంగాలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్.. అధికార బీజేపీ అభ్యర్థిని వెనక్కి నెట్టినిలబట్టుకుంది. ఫిబ్రవరి 24న ముంగాలి, కొలారస్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.
బుధవారం కౌంటింగ్ ప్రక్రియ జరగ్గా.. మొదటి నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ముంగాలిలో కాంగ్రెస్ అభ్యర్థి బ్రజేంద్ర సింగ్ యాదవ్ తన ప్రత్యర్థిపై 2,214 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
బ్రజేంద్ర సింగ్కు 70,808ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి బైసాహబ్ యాదవ్కు 68,684 మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేంద్ర సింగ్ కలుఖేదా మృతి కారణంగా ఖాళీ అయిన ముంగాలి స్థానాన్ని మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థే కైవసం చేసుకున్నాడు.
మరో నియోజకవర్గమైన కొలారస్లోను కాంగ్రెస్ తన సత్తా చాటింది. తన ప్రత్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి 8083 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.
ఒడిశాలో బీజేడీ జయకేతనం
భునేశ్వర్: ఒడిశాలోని బీజేపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేడీ అభ్యర్థి రీటా సాహు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి అశోక్ పాణిగ్రాహిపై దాదాపు 42వేల ఓట్ల మెజార్టీతో రీటా విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
బీజేపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబల్ సాహు గత ఆగస్టులో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే సాహు భార్య రీటా సాహు బీజేడీ తరఫున పోటీ చేశారు. ఫిబ్రవరి 24 బీజేపూర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. బీజేపూర్లో బీజేడీ పార్టీ విజయం సాధించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తంచేశారు.
ఈ ఉప ఎన్నికల ప్రభావం కచ్చితంగా 2019 సాధారణ ఎన్నికలపై చూపిస్తుందని పట్నాయక్ వెల్లడించారు. అధికార బీజేడీ పార్టీ సభ్యుడికి భారీ మద్దతు ఇచ్చినందుకు బీజేపూర్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన విజయానికి సహకరించిన బీజేపూర్ నియోజకవర్గంలోని ప్రజలకు రీటా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.