సంచలన బిల్లు ఆమోదం: రేప్లకు ఇక ఉరిశిక్షే
భోపాల్: చెప్పినట్లుగానే అత్యాచారాల విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన బిల్లును ఆమోదించింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు, సామూహిక అత్యాచారాలకు పాల్పడే వారికి ఇకపై ఉరిశిక్ష విధిస్తారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
ఇటీవలే ఈ బిల్లుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికి రాష్ట్రపతి ఆమోదం లభించాల్సి ఉంది. ఆ ప్రక్రియ కూడా పూర్తయితే అత్యాచార దోషులకు ఉరిశిక్ష విధిస్తారు.
దోషులుగా తేలిన వారిని చనిపోయేంత వరకు ఉరితీయాలని బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లు చట్టంగా మారితే ఈ తరహా శిక్షను అమలు చేసే తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్ అవుతుంది. న్యాయ, శాసనసభా వ్యవహారాల మంత్రి రాంపాల్ సింగ్ ఈ బిల్లును సభలో ప్రతిపాదించారు.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరిక మేరకు ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొందిన ఈ రోజు మధ్యప్రదేశ్లో చారిత్రక దినమని రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ మీడియా ప్రతినిదులతో అన్నారు.
తీవ్రమైన శిక్షలు వేస్తే తప్ప సక్రమమైన దారిలోకి రాని వ్యక్తులు వ్యవస్థలో ఉన్నారని, అటువంటి వారిని ఈ బిల్లు అదుపులో పెడుతుందని, ఆ విధమైన నేరాలపై సమాజంలో చైతన్యం కలిగిస్తామని ముఖ్యమంత్రి చౌహాన్ అన్నారు.