సిఆర్ఫీఎఫ్ అధికారులను అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత! ముందస్తు సమాచారం ఇవ్వాలన్న ఈసి
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సహచరుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. ఉదయం ఆరంభమైన దాడులు రాత్రి వరకూ కొనసాగాయి. దాడుల్లో పాల్గొన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులకు రక్షణ కల్పించడానికి వఛ్చిన సిఆర్ఫీఎఫ్ సిబ్బందిని మధ్య ప్రదేశ్ పోలీసులు అడ్డుకోవడం ఉద్రికతకు దారితీసింది. ఓ దశలో సిఆర్ఫీఎఫ్ సిబ్బంది, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గతంలో ఈ తరహా దాడులను పశ్చిమ బెంగాల్ ముఖమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆదయ్యపు పన్ను శాఖ అధికారుల దాడులను నిరసిస్తూ ఆమె అర్ధరాత్రి ధర్నా చేశారు. అదే తరహా వాతావరం ఆదివారం రాత్రి భోపాల్ లో కనిపించింది.
కమల్ నాథ్ అనుచరుడు
దేశవ్యాప్తంగా సుమారు 50 ప్రాంతాల్లో 300 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అనుచరుడు, ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. మరో ప్రధాన అనుచరుడు ఆర్కే మిగ్లానీ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఒక్క ఢిల్లీలోనే 35 ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. భోపాల్లోని రతుల్ పురి, అమైరా గ్రూప్ అండ్ మోసర్ బేయర్లలో, ఇండోర్, గోవా తదితర ప్రాంతాల్లో ఆ దాడులు కొనసాగుతున్నాయి. ప్రవీణ్పై హవాలా లావాదేవీల ఆరోపణలు రావడంతో ఈ సోదాలు ఆరంభించారు. అర్దరాత్రి వరకూ ఈ సోదాలు కొనసాగాయి.
తమకు సమాచారం ఇవ్వాలి..
సోదాలఅపి కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ సునీల్ అరోరా స్పందించారు. తమకు సమాచారం లేకుండా దాడులు చేయకూడదని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, తమకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తప్పనిసరిగా తమకు ముందస్తుగా తెలియపర్చాలని ఎలక్షన్ కమిషన్ కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ పరిధిలోకొచ్చే ఆదాయపు పన్ను, ఇతర విభాగాలకు ప్రత్యేకంగా నోటీసులు పంపింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, ఆయన బంధువులు, వ్యక్తిగత కార్యదర్శి నివాసాల్లో జరిగిన సోదాలు దుమారం రేపడంతో కమిషన్ జోక్యం చేసుకుంది. ఎన్నికల వేళ జరిపే తనిఖీలు తటస్థంగా వుండాలని, ఇందులో రాజకీయాలకు అవకాశం ఇవ్వకూడదని, పక్షపాతం ఉండకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నోటీసుల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఆ దాడులు ఎన్నికల అవకతవకలను అడ్డుకోవడానికి సంబంధించినవైనా, నల్లధన నిల్వలను అడ్డుకోవడానికి ఉద్దేశించినవి అయినప్పటికీ ఏ రాజకీయ పార్టీనీ టార్గెట్ చేయకూడదని పేర్కొంది. కోడ్ అమల్లో ఉన్నంతవరకూ తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, దీన్ని పాటించాలని సూచించింది.
సిఆర్ఫీఎఫ్ సిబ్బందిని అడ్డుకున్న పోలీసులు..
ప్రవీణ్ కక్కర్ నివాసంలోకి సిఆర్ఫీఎఫ్ అధికారులు ప్రవేశించకుండా పోలీసులు అడ్డుగా నిల్చున్నారు. వారితో గొడవ పడ్డారు. అధికారుల నివాసాల్లోకి ప్రవేశించే హక్కు వారికి లేదంటూ వాగ్వివాదానికి దిగారు. అధికారుల నివాస సముదాయంలో అనుమతి లేకుండా ఎలా ప్రవేశిస్తారని నిలదీశారు. దీనిపై సిఆర్ఫీఎఫ్ అధికారి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ మధ్య ప్రదేశ్ పోలీసులు తమ విధులు తాము చేయనీయకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. తమ పై అధికారుల ఆదేశాలను తాము అనుసరిస్తున్నామని, ఉద్దేశపూర్వకంగా తాము రాలేదని అన్నారు. విధి నిర్వహణలో ఎవరు అడ్డుగా వచ్చినా పట్టించుకోవద్దని పైఅధికారులు సూచించారని ప్రదీప్ కుమార్ అన్నారు.