పోలీసుల అత్యుత్సాహం: రైతుల బట్టలిప్పి ఇలా....
రైతులను బట్టలిప్పి మధ్యప్రదేశ్ పోలీసులు అవమానించారు.ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించనున్న రైతులురాళ్ళు రువ్వడంతోనే లాఠీఛార్జీ చేశామని పోలీసులు ప్రకటన
భోపాల్: తమ సమస్యలపై ఆందోళన చేపట్టిన అన్నదాతలను దుస్తులు విప్పిమరీ దారుణంగా అవమానించారు మధ్యప్రదేశ్ పోలీసులు.ఈ ఘటనపై రైతులు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.
మధ్యప్రదేశ్లోని తికాంగఢ్ కలెక్టరేట్ వద్ద పరిసర గ్రామాల రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళన తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్లు ప్రయోగించారు. లాఠీచార్జితో విరుచుకుపడ్డారు. మరికొందరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆందోళనకు స్థానిక ప్రతిపక్ష కాంగ్రెస్ నేత యద్వేంద్ర సింగ్ మద్దతు ప్రకటించారు.
పోలీసుల లాఠీచార్జి కారణంగా 30 మంది రైతులు గాయపడ్డారు. నేను ఇంటికి వెళ్లిన తర్వాత దాదాపు 40 మందిని అరెస్టు చేసి దెహాత్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినట్టు సమాచారం అందించిందని యద్వేంద్ర సింగ్ చెప్పారు. అక్కడికి వెళ్లి చూసే సరికి రైతులంతా లోదుస్తుల్లో కనిపించారని యద్వేంద్రసింగ్ గుర్తుచేశారు.
పోలీసులు వారందర్నీ రైతులను తీవ్రంగా కొట్టారని కాంగ్రెస్ నేత యద్వేంద్ర సింగ్ ఆరోపించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. వీడియోతో సహా మేము ఎన్హెచ్ఆర్సీతో పాటు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు యద్వేంద్ర సింగ్.
రైతులు పోలీసులపై రాళ్లు రువ్విన కారణంగానే లాఠీచార్జి చేయాల్సి వచ్చిందంటూ తికాంగఢ్ ఎస్పీ కుమార్ ప్రతీక్ పేర్కొన్నారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులతో పాటు మరో ఆందోళనకారుడు గాయపడ్డారని ఆయన చెప్పారు.