అస్వస్థతకు గురైన బీజేపీ ఎంపీ... విమానంలో ముంబై తరలింపు... కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరిక...
బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడుతుండటంతో హుటాహుటిన విమానంలో ముంబైకి తరలించారు. ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో ఎంపీని చేర్చినట్లు ఆమె కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఆమె అస్వస్థతకు గురవడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఫిబ్రవరి 19న అస్వస్థతకు గురైన ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
అంతకుముందు,డిసెంబర్,2019లో ఆమె కరోనాతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ కొద్దిరోజుల చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రగ్యా అనారోగ్య కారణాలతో 2017లో బాంబే హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీ చేసిన ఆమె కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్పై 3.6లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తి ఎంపీగా గెలవడం దేశంలో ఇదే తొలిసారి.
ప్రగ్యా సింగ్ ఠాకూర్ గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మహాత్మాగాంధీ చంపిన నాథురాం గాడ్సేని దేశభక్తుడు అంటూ కొనియాడారు. గతేడాది డిసెంబర్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... క్షత్రియులను క్షత్రియులని పిలిస్తే బాధపడరని, బ్రాహ్మణులను బ్రాహ్మణులని అంటే వారు చింతించరని, వైశ్యులను వైశ్యులని పిలిస్తే బాధపడరని, కానీ శూద్రులను మాత్రం శూద్రులని అంటే తెగ బాధపడిపోతారని, ఎందుకంటే వారు అజ్ఞానులని ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ప్రగ్యా వ్యాఖ్యలపై స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... ఆమెకు పిచ్చెక్కిందని కౌంటర్ ఇచ్చారు.
Madhya Pradesh: Bhopal MP Pragya Singh Thakur taken to Mumbai after she complained of problem in breathing, will be admitted to Kokilaben hospital, according to the MP's office pic.twitter.com/D6PTlkjeAL
— ANI (@ANI) March 6, 2021