పార్లమెంట్ సబ్సీడీ భోజనంకు ఎంపీలు గుడ్బై..ఎంత మిగులుతుందో తెలుసా..?
న్యూఢిల్లీ: అది చట్టాలు చేసే పార్లమెంటు భవనం. చట్టాలు చేసేవారు ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాప్రతినిధుల్లో చాలామంది కోటీశ్వరులే ఉన్నారు. అయితే వారు తినే భోజనంపై మాత్రం సబ్సీడీ ఉంటుంది. ఎక్కడా అనుకుంటున్నారా..? అదేనండీ పార్లమెంటు భవనంలోని క్యాంటీన్లో ఎంపీలు టీ, టిఫిన్ భోజనం చేస్తే వారికి సబ్సడీ లభిస్తుంది. ఇలా క్యాంటీన్కు సబ్సీడీ చెల్లించేందుకు ప్రభుత్వం పై భారం పడుతోంది. అయితే ఈ పాతపద్ధతికి ఎంపీలు గుడ్బై చెప్పేశారు.
బహిరంగంగా ఉరితీయండి: దిశ ఘటనపై జయాబచ్చన్ డిమాండ్, ముక్తకంఠంతో పార్లమెంటు
సబ్సీడీ భోజనంకు ఎంపీల గుడ్బై
పార్లమెంటులో ఎంపీలు అల్పాహారం, భోజనం చేస్తే ఇందుకు వారు చెల్లించేంది చాలా తక్కువ. చికెన్ బిర్యానీ తినాలంటే బయట రూ.200 చెల్లిస్తేకానీ రాదు. ప్రజాప్రతినిధులకు మాత్రం జస్ట్ రూ.65 చెల్లిస్తే చాలు.. హ్యాపీగా చికెన్ బిరియాని ఒకటేంటి రెండు లాగించేస్తారు. ఒక్క బిర్యానీనే కాదు మటన్ కర్రీ రూ.45, అన్నం రూ.7, తండూరి చికెన్ రూ.60 ఇలా ఏది ముట్టుకున్న ఆ ఐటెం చాలా తక్కువకే వస్తుంది. ఎందుకంటే ఎంపీలు క్యాంటీన్లో భోజనం చేస్తే వారికి సబ్సీడీ లభిస్తుంది. దీంతో వారి జేబులో నుంచి ఖర్చు పెట్టేది చాలా తక్కువగా ఉంటుంది. మిగతాది ప్రభుత్వం క్యాంటీన్కు చెల్లిస్తుంది. ఇలా ఏటా రూ.17 కోట్లు క్యాంటీన్కు చెల్లిస్తోంది ప్రభుత్వం.
స్పీకర్ ఓంబిర్లా విజ్ఞప్తి మేరకు...
ఇక ఎంపీలు పార్లమెంటు క్యాంటీన్లోని భోజనంపై లభించే సబ్సీడీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ మేరకు ఎంపీలంతా ఏకాభిప్రాయంకు వచ్చినట్లు తెలుస్తోంది. సబ్సడీకి గుడ్బై చెప్పడం ద్వారా ప్రభుత్వానికి రూ.17 కోట్లు మిగల్చనున్నారు. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని రాజకీయ పార్టీల నేతలతో సబ్సీడీపై మాట్లాడిన తర్వాత వారు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఎంపీలంతా ఒక నిర్ణయానికి రావడంతో ఇకపై పార్లమెంటు క్యాంటీన్లో అసలు ధరలకే భోజనం అమ్మడం జరుగుతుంది.
2015లో ఎంపీల సబ్సీడీ పై పెద్ద ఎత్తున విమర్శలు
2015లో ఎంపీల భోజనంకు 80శాతం సబ్సీడీ లభిస్తోందన్న వార్త బయటకు రాగానే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 95శాతానికి పైగా ఎంపీలు ఆర్థికంగా బలంగా ఉన్నవారే అని కనీసం భోజనంకు డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉన్నారా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అంశంపై నెటిజెన్లు ఎంపీలను ఓ ఆటాడేసుకున్నారు. అప్పటి బీజేపీ లోక్సభ ఎంపీ బైజయంత్ జే పండా స్పీకర్కు సబ్సడీ భోజనంపై లేఖ రాశారు. ఎంపీలంతా పార్లమెంటు క్యాంటీన్లోని భోజనంపై వచ్చే సబ్సీడీ వద్దని చెబితే ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని చూరగొంటామని రాశారు.
త్వరలో అసలు ధరలతోనే ఎంపీలకు భోజనం
డిసెంబర్ 31, 2015లో అప్పటి లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంటులోని క్యాంటీన్ లాభ నష్టాలపై పనిచేయదని అందులో లభించే ఐటెమ్స్ ధరలు ఒరిజినల్గానే ఉండాలంటూ ప్రకటన విడుదల చేసింది. అయితే అది పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. తాజాగా ఎంపీలంతా స్పీకర్ ఓంబిర్లా విజ్ఞప్తి మేరకు సబ్సీడీకి స్వస్తి పలుకుతున్నట్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో అసలు ధరలతోనే అక్కడ భోజనం అమ్ముతారని తెలుస్తోంది.