నాథురాం గాడ్సే దేశభక్తుడు... కాదు: బీజేపీ ఎంపీ సాక్షి యూ టర్న్
ముంబై: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్ మహారాష్ట్రలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే పైన ఆయన ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
మహాత్ముడిని హత్య చేసిన నాథూరాం గాడ్సే జాతీయవాది అని, దేశభక్తుడని, ఆ తర్వాత మారిపోయాడని వ్యాఖ్యానించారు. అనంతరం వెంటనే తాను చేసిన వ్యాఖ్యలను సరిదిద్దికున్నారు. తానేదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఆ మాటలు వెనక్కు తీసుకుంటానని చెప్పారు. నాథూరాం గాడ్సే దేశభక్తుడు అంటే తాను అంగీకరించనని చెప్పారు.
సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు గురువారం నాడు పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చాయి. మహారాష్ట్రలో భజరంగ దళ్, ఆరెస్సెస్లు సౌర్య దివస్ పేరిట ప్రతియేటా గాడ్సే సంస్మరణ సభలు జరుపుతున్నా కేంద్రం అడ్డుకోవడం లేదంటూ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.
దీని పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. అటువంటి వ్యక్తులను గౌరవించే సమస్యే లేదని, ప్రభుత్వం తరపున సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించమని ఆయన చెప్పారు.
కాగా, కొద్ది రోజుల క్రితం ఆరెస్సెస్ మలయాళ మౌత్ పీస్లో సాక్షి మహారాజ్ నాథురాం గాడ్సేను స్తుతించారు. నాథురాం గాడ్సే జాతిపిత మహాత్మా గాంధీని చంపే బదులు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను చంపాల్సి ఉండెనని పేర్కొన్నారు. నెహ్రూ కంటే గాడ్సే చాలా గొప్పవాడన్నారు. గాడ్సే మహాత్ముడి చాతిలో కాల్చినప్పటికీ, అతను గాంధీజీని గౌరవించాడని, నెహ్రూ మాత్రం గాంధీ ముందు బాగా ఉండి, వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.