మహిళలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు: ఓటు వేయాలంటే బుర్ఖా తీయాల్సిందే..!
Recommended Video
ముజఫర్ నగర్ : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లో ఓ కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలపై ఆ మంత్రివర్యులు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ముస్లిం మహిళలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి ముజఫర్నగర్ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ బాలియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటువేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పురుష అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయాలనే వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బుర్ఖాలు ధరించిన ముస్లిం మహిళలను అధికారులు చెక్ చేయాలని లేదంటే వారు ఓటు వేసి మళ్లీ పోలింగ్ బూతులకు వచ్చి ఓటు వేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు వేసేందుకు బుర్ఖా ధరించి వస్తే ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బుర్ఖా ధరించిన ఒకే మహిళ నాలుగైదు సార్లు వచ్చి ఓటు వేస్తున్నారని సంజీవ్ బలియన్ ఆరోపించారు.
బుర్ఖా తీసి ఓటు వేయాలన్న సంజీవ్ బాలియన్
ముఖాన్ని చూడకుండా అధికారులు ఎలా ఓటు వేసేందుకు అనుమతిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కొన్ని పోలింగ్ బూత్లలో మహిళా కానిస్టేబుళ్లు లేరని చెప్పిన ఆయన పెద్ద సంఖ్యలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళా ఓటర్లు క్యూలైన్లలో నిల్చున్నారని వారిని ఎవరు తనిఖీ చేస్తారని ప్రశ్నించారు. ఆ సమయంలో పోలింగ్ అధికారులుగా ఉన్న పురుషులే తనిఖీ చేయాలని అన్నారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు బుర్ఖాలు తీసి ఓటింగ్లో పాల్గొనాలని అన్నారు. బలియన్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఈ ఘటన ముజాఫర్నగర్ పార్లమెంటులోని సుజ్దు గ్రామంలో 225వ బూతులో చోటుచేసుకుంది. ముస్లిం మహిళలను ఓటు వేయకుండా బలియన్ అనుచరులు గేటువద్దే అడ్డుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
మంత్రి వ్యాఖ్యలు ముస్లిం మహిళలను అవమానించేలా ఉన్నాయి: కాంగ్రెస్
ఎంపీ సంజీవ్ బాలియన్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు స్పందించారు. ప్రతి పోలింగ్ బూత్ల వద్ద మహిళా అధికారులు మహిళలను తనిఖీ చేసేందుకు ఉంచామని చెప్పారు. మహిళా కానిస్టేబుళ్లు లేరనేది అవాస్తవం అని వెంకటేశ్వర్లు తెలిపారు. బాలియన్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలను అవమానించేలా సంజీవ్ బాలియన్ వ్యాఖ్యలు ఉన్నాయని వెంటనే ఈసీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.