తుపాకీతో కాల్చుకుని భయ్యూజీ మహారాజ్ ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్కు చెందిన ఆధ్యాత్మిక గురూ బాబా భయ్యూజీ మహరాజ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడంతో ఆయనను హుటాహుటిన ఇండోర్లోని బాంబే ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఆధ్యాత్మికవేత్తగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న భయ్యూజీకి ఇటీవల నర్మదా నదీ ప్రక్షాళన బోర్డులో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. అయితే, కారు, ఇతర మంత్రులకిచ్చే సౌకర్యాలను మాత్రం తనకు అవసరం లేదని భయ్యూజీ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
భయ్యూజీ మహరాజ్ 17 ఏళ్లగా పలువురు కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అంతేగాక, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు భయ్యూజీ సన్నిహితుడు. మొదట భయ్యూజీ మహారాజ్ అసలు పేరు ఉదాసింగ్ దేశ్ముఖ్.
జమీందార్ కొడుకైన ఆయన.. మొదట మోడలింగ్ కూడా చేశారు. ఆ తర్వాత అన్నింటినీ వదిలేసి ఆధ్యాత్మిక గురువుగా మారిపోయారు. పేద ప్రజల ముఖాల్లో సంతోషం చూడటమే తన లక్ష్యమని చెప్పేవారు. సమాజంలో అసమానతలు ఉండకూడదని తలిచేవారు. కాగా, గత కొద్దికాలం క్రితమే ఆయన భార్య కూడా కన్నుమూసింది.
2011లో అన్నాహజారే లోక్పాల్ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టినప్పుడు మరోసారి భయ్యూజీ పేరు ప్రచారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అన్నా నిరాకరించడంతో అన్నాకు చెప్పి ఒప్పించేందుకు అప్పట్లో విలాస్రావు దేశ్ముఖ్...భయ్యూజీని ముందుకు తీసుకువచ్చారు. భయ్యూజీ ఇందులో విజయవంతమయ్యారు.