అదుపుతప్పి కారు బోల్తా: బీజేపీ ఎంపీకి తీవ్రగాయాలు
హరిద్వార్: ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్వాల్ భారతీయ జనతా పార్టీ ఎంపీ తీరథ్ సింగ్ రావత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెడ, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి హరిద్వార్కు రైలు మార్గంలో చేరుకున్నారు ఎంపీ తీరథ్ సింగ్. అక్కడి నుంచి పౌరీ గఢ్వాల్ పట్టణానికి భద్రతా సిబ్బందితో కలిసి కారులో బయలుదేరారు. కాగా, భీంగోడ-పంత్ దీప్ ప్రాంతంలోకి రాగానే ఎంపీ కారు అదుపు తప్పి మరో కారును ఢీకొట్టింది.
ఆ తర్వాత బోల్తా పడింది. ఈ ఘటనలో ఎంపీ తీరథ్ సింగ్కు మెడ, నడుము భాగాల్లో గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హరిద్వార్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్కు తీసుకెళ్లి చికిత్స అందించాలని వైద్యులు సూచించారు.
రైలు నుంచి దిగుతూ దంపతుల మృతి
విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు దిగుతూ ప్రమాదవశాత్తు జారిపడి ఓ దంపతులు మృత్యువాత పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లపలస గ్రామానికి చెందిన దంపతులు కె వెంకటరమణారావు(40), మణి(35) శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న ప్రత్యేక రైళ్లో స్వగ్రామానికి బయలుదేరారు.
ఆదివారం తెల్లవారుజామున దువ్వాడ స్టేషన్కు చేరుకున్నారు. దువ్వాడలో వెంకటరమణ భార్య మణి తల్లిదండ్రులు ఉండటంతో వారిని చూసేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో నాలుగు నెంబర్ ప్లాట్ఫాం వద్ద దిగేందుకు ప్రయత్నిస్తూ.. ప్రమాదశాత్తు పట్టాలపై జారిపడి ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.