ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసిన ఎంపీ విజయసాయి రెడ్డి .. కారణం ఇదే
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ విజయసాయి రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీలో కలిశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ, కరోనా నిబంధనలకు అనుగుణంగా దూరంగా కూర్చుని మాట్లాడారు విజయ సాయి రెడ్డి. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని విజయసాయి రెడ్డి ఉపరాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేశారని సమాచారం .
వ్యవసాయం, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరి పీచు, పసుపు ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన స్థాయి సంఘం ఆమోదించిన 154వ నివేదికను విజయ సాయి రెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి అందించారు. విజయసాయిరెడ్డి పార్లమెంట్ స్థాయి సంఘం వాణిజ్యం కమిటీ చైర్మన్గా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో చర్చించారు. పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి ని ఆయన కోరినట్లుగా విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని కూడా కోరినట్లుగా తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతులు సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తులను కేవలం ఎగుమతుల వరకే పరిమితం చేయాలని అలా చేయడం వల్ల రైతులకు రైతు కూలీలకు నష్టం జరగదని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు టీ ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోషన్ చేపట్టడంతో పాటు, పొగాకు ఉత్పత్తి పై బ్యాలెన్స్ పద్ధతి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.