పెద్ద మొత్తంలో బాకీ, హోటల్ ఖాళీ చేయండి: ఎంపీలకు కేంద్రం
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత హోటల్ అశోకను ఖాళీ చేయాలని పార్లమెంటు సభ్యులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడే ఎంపీలకు హోటల్లో వసతి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పార్లమెటు సభ్యులకు ఢిల్లీలో అధికారిక నివాసాన్ని సమకూర్చలేనప్పుడు భారత పర్యాటక సంస్థ (ఐటీడీసీ) ఆధ్వర్యంలో నడిచే అశోక హోటల్లో గదులు కేటాయిస్తారు. 30 మంది ఇప్పటికీ హోటల్లోనే ఉంటున్నారు. వీరికి రోజుకు రూ.9000 చొప్పున బిల్లు నేస్తున్నారు.
1990-91 నుండి 2013-14 వరకు ఎంపీలు తాత్కాలిక వసతి నిమిత్తం ప్రభుత్వం రూ.35.75 కోట్లు విడుదల చేయవలసి వచ్చింది. మరో దాదాపు, రూ.25 కోట్లు బాకీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ హోటళ్లలో ఉంటున్న ఎంపీలకు బడ్జెట్ సమావేశాల తర్వాత హోటల్ బిల్లు చెల్లించడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
మే 8 నాటికి లోకసభ సభ్యులు, మే 13 నాటికి రాజ్యసభ సభ్యులు హోటల్ను ఖాళీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. గత సార్వత్ర ఎన్నికల అనంతరం 315 మంది ఎంపీలు హోటల్లో తొలుత బస చేశారగు. ప్రస్తుతం ఆ సంఖ్య 30కి తగ్గింది. అశోక హోటల్ 2014 సెప్టెంబర్కు ముందు రోజుకు రూ.7000 వసూలు చేసేది. ఇప్పుడు రోజుకు రూ.9000 వసూలు చేస్తోంది.
ఎంపీలకు నోటీసులు ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం చెప్పారు. కాగా, ఈ లిస్ట్లో హేమమాలిని కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి దీనిపై మాట్లాడుతూ.. తాను మరికొద్ది రోజుల్లో వెకేట్ చేస్తానని, తన నూతన 4 బీహెచ్కే భవనం పూర్తి కావొస్తుందని చెప్పారు.